Tuesday, April 23, 2024

Big Story | వామ్మో, పెద్ద స్కెచ్చే.. నకిలీ ఐపీఎస్‌ ఆఫీసర్‌ స్కామ్‌!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: పోలీసు, నిఘా వ్యవస్థలకు ఛాలెంజ్‌ విసుర్తూ.. నకిలీ ఉన్నతాధికారి రూపంలో ఓ ఘరానా మోసగాడు చేసిన అకృత్యాలు సమాజం నివ్వెర పోయేలా చేస్తున్నాయి. నకిలీ ఐపీఎస్‌ అవతారమెత్తిన ఓ నేరగాడు పలువురిని మోసం చేశాడు. అమాయకులను బెదిరించి డబ్బులు దండుకున్నాడు. ఆర్మీ అధికారినంటూ బంధువులనూ, స్నేహితులను నమ్మించి ఉద్యోగాలు ఇప్పిస్తానని వంచించాడు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టునని జేబుదొంగలను సైతం బెదిరించాడు. ఈ క్రమంలో పలుసార్లు జైలుకు వెళ్లొచ్చినా.. పోలీసులు పీడీ చట్టం ప్రయోగించినా బుద్ధి మారలేదు.

డబ్బులు వసూలు చేసే క్రమంలో అమాయకులను పోలీసుల తరహాలో ఇంటరాగేషన్‌ చేశాడు. చివరికి మరోసారి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. చిన్నప్పటి నుంచి పోలీస్‌ అధికారి కావాలని ఓ యువకుడు కలలు కన్నాడు. దానికోసం కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత నేరగాడిగా అవతారమెత్తి, ఖాకీ దుస్తులపై మోజు పెంచుకున్నాడు. దుస్తులు అమ్మే దుకాణానికి వెళ్లి పోలీసు, ఆర్మీ యునిఫామ్‌లు కొన్నాడు. ఐపీఎస్‌, ఆర్మీ అధికారిగా నకిలీ అవతారమెత్తాడు.

క్యాబ్‌డ్రైవర్‌గా పనిలోకి.. తూర్పు గోదావరి జిల్లా చిక్కాల గ్రామానికి చెందిన నాగరాజు రఘు వర్మ అలియాస్‌ కార్తిక్‌ డిగ్రీ పూర్తి చేశాడు. 2016లో హైదరాబాద్‌ వచ్చాడు. 2017లో సనత్‌నగర్‌ లోని గౌస్‌ పాషా ట్రావెల్స్‌లో క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేశాడు. పనిచేసే సమయంలో అక్కడ ఇన్నోవా దొంగిలించాడు. ఈ కేసులో సనత్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఆరు నెలల తర్వాత విడుదల అయిన నాగరాజు నాలుగు నెలల పాటు- మహారాష్ట్రలోని బోర్‌వెల్‌ సంస్థలో పని చేశాడు.

- Advertisement -

ఆర్మీ అధికారితో పరిచయం..
బిక్కుదర్‌ అనే మాజీ ఆర్మీ అధికారితో పరిచయం పెంచుకుని.. అతని వద్ద నుంచి ఆర్మీ ర్యాంకులు, డ్రెస్సులు, బ్యాచ్‌లు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నాడు. ఆర్మీ యునిఫామ్‌లు విక్రయించే చోటికి వెళ్లి.. మేజర్‌ ర్యాంకు యునిఫామ్‌లు కొన్నాడు. యునిఫామ్‌తో తన స్వగ్రామానికి వెళ్లి స్నేహితులకు, బంధువులకు తాను పారా స్పెషల్‌ ఫోర్స్‌లో మేజర్‌ నంటూ నమ్మించాడు. నిరుద్యోగ యవతకు ఆర్మీ ఉద్యోగాలు ఇస్తానంటూ అనుమతి లేకుండా డిఫెన్స్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించాడు. పోడూర్‌ పోలీసులకు అతనిపై అనుమానం రావడంతో ఆరా తీయగా నకిలీ అధికారి అని తేలడంతో ఆరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.

కిడ్నాప్‌ దందాలు..
బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం రూటు- మార్చిన నాగరాజు ఆర్మీ కల్నల్‌ అవతారం ఎత్తాడు. వీవీఐపీ లాగా పలు కార్యక్రమాలకు వెళ్లాడు. మదీనాగూడలోని ఐ హెల్త్‌ కార్ట్‌ హాస్పిటల్‌
ను ప్రారంభించాడు. ఇందుకు లక్షకు పైగా పారితోషకం తీసుకున్నాడు. ఈ వ్యవహరంలో మియాపూర్‌ పోలీసులు ఇతనిపై కేసు నమోదు చేశారు. అనంతరం అతనికి పరిచయం ఉన్న అనిల్‌ కుమార్‌ అనే వ్యక్తి అభ్యర్థన మేరకు అనుచరులతో కలసి దిలీప్‌
కుమార్‌ అనే వ్యక్తిని అపహరించారు. అతడిని సూర్యాపేట బస్ స్టాప్‌ వద్దకు తీసుకెళ్లి రూ.1.90 లక్షలు కాజేసి అతడిని అక్కడే వదిలి వెళ్లారు.

అంతర్రాష్ట్ర నేరాలు..
క్రైం బ్రాంచ్‌ ఎనలిటిక్స్‌ అధికారిని అని చెప్పి కొంత మంది బాధితుల నుంచి రూ. 3.70లక్షలు కాజేశాడు. సైబర్‌ నేరగాడు యశ్వంత్‌తో నాగరాజు పరిచయం పెంచుకున్నాడు. యశ్వంత్‌కు తెలిసిన వ్యక్తి అయిన పాశ్వాన్‌ ద్వారా జార్ఖండ్‌లోని కుండా గ్రామానికి వెళ్లి దేశవాళీ తుపాకి కొనుగోలు చేశాడు. మార్చిలో పోలీసు యూనిఫారమ్‌, వాకీటాకీ, పోలీసులు వాడే ప్లాష్‌ లైట్‌ కొనుగోలు చేసిన నాగాజు.. హైదరాబాద్‌ పాతబస్తీ మదీనాలో హ్యండ్‌ కప్స్‌, పిస్టల్‌ పౌచ్‌, తదితర వస్తువులు కొనుగోలు చేశాడు. నాగరాజును శంషాబాద్‌ ఎస్‌ఓటీ- పోలీసులు అరెస్ట్‌ చేసి, దేశవాళీ తుపాకీ, 9 బుల్లెట్లు-, 4 సెల్‌ఫోన్లు, యునిఫామ్‌లు, వైర్‌లెస్‌ మైక్‌సెట్లు- స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్లను పరిశీలించినప్పుడు నాగరాజు పలువురిని దాడి చేస్తూ తీసుకున్న దృశ్యాలు బయటపడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement