Friday, March 15, 2024

Big Breaking: నిజామాబాద్ పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలే.. ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్​

ప్రగతి పథంలో దూసుకుపోతున్న నిజామాబాద్ పట్టణాన్ని అభివృద్ధి మరింత ద్విగుణీకృతమై కండ్లకు కట్టాలె అని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. రెండున్నర నెల్లల్లో ప్రణాళికాబద్దంగా పనులను పూర్తిచేయాలనీ, తాను పర్యటించి పనులను పరిశీలిస్తానని తెలిపారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, మున్సిపల్ శాఖ, తదితర అన్ని శాఖలు సమన్వయంతో నిజామాబాద్ అభివృద్ధి పనులను పూర్తి చేసేలా పనుల్లో నిమగ్నం కావాలని, స్థానిక ఎమ్మెల్యే గణేశ్ బిగాలను సీఎం ఆదేశించారు. నిజామాబాద్ అభివృద్ధికి నిధుల కొరత లేదని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే విడుదలైన నిధులతో పాటు నిజామాబాద్ నగరాభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులను విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రటరీకి సమావేశం నుంచే సీఎం కేసీఆర్​ ఫోన్ చేసి ఆదేశించారు.

‘‘ఒకనాడు గందరగోళంగా వున్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో నేడు సుందరనగరం గా మారింది. ఖమ్మాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్టు నిజామాబాద్ ను కూడా తీర్చిదిద్దాలె. మీరంతా కలిసి ఖమ్మం టూరు వెల్లండి అక్కడ జరిగిన అభివృద్ధిని పరిశీలించి రాండి.’’ అని నిజామా బాద్ అధికారులను, ఎమ్మెల్యేను సిఎం ఆదేశించారు. నిజామాబాద్ నగరంలో రోడ్ల నిడివి ఎంత వున్నదో అంచనా వేయాలన్నారు. గ్రావెల్ రోడ్లను బిటి రోడ్లుగా మార్చాలని చెప్పారు. స్మశాన వాటికలు, బరీయల్ గ్రౌండ్లు ఎన్ని కావాల్సి వున్నది..? సమీకృత మార్కెట్లు ఎన్ని కావాల్సి వున్నయి.? కమ్యునిటీ హాల్లు ఎన్ని కావాలి ? డంప్ యార్డులు..వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, అన్నీ అత్యంత వేగంగా పనులు పూర్తి చేయాలన్నారు.

నిజామాబాద్ లో మెత్తం దోభీ గాట్లు, సెలూన్లను అంచనావేసి మాడ్రన్ దోభీఘాట్లను మోడ్రన్ సెలూన్లను నిర్మించాలన్నారు. నిజామాబాద్ నగరంలో గార్డెన్ల పరిస్థితిని సిఎం అడిగి తెలసుకున్నారు. పబ్లిక్ గార్డెన్లను తక్షణమే మెరుగు పరచాలన్నారు. తాను చిన్ననాడు నాటి తిలక్ గార్డెన్ లో వెల్లి కూర్చేనే వాడినని సిఎం గుర్తచేసుకున్నారు. తిలక్ గార్డెన్ ను పునరుద్ధ రించాలన్నారు. మొక్కలను నాటడం పచ్చదనం పెంచే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను సుందరీకిరించాలని సిఎం ఆధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరంలో మొత్తం వున్న ప్రభుత్వ భూములెన్ని వాటిల్లో ప్రజావసరాలకోసం వినియోగించుకోవాడనికి ఎన్ని అనువుగా వున్నాయో ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు.

సమీకృత కలెక్టరేట్ నిర్మాణం తర్వాత పలు శాఖలు వారి కార్యాలయాలను ఖాళీ చేసాయని, ఆయా శాఖల భవనాల పరిస్థితి ఏంది..వాటి స్థలాలను, కార్యాలయ భవనాలను ప్రజావసరాలకు ఏ విధంగా వినియోగించుకోవచ్చునో ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఎం అన్నారు. నిజామాబాద్ పట్టణాభివృద్ధి కోసం అనుసరించాల్సిన పద్దతులను ఈ సందర్భంగా సిఎం అధికారులకు వివరించారు. పౌరులకు కల్పించాల్సిన సౌకర్యాలను రూపొందించుకుని వాటికోసం చేపట్టాల్సిన నిర్మాణాత్మక పనుల ప్రణాళికలను సిద్దం చేసుకోవాలన్నారు. దాంతో పాటు నగరాన్ని సుందరీకరించే అంశాలేమిటో పరిశీలించి అందుకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అలంకారాలేమిటి అనే ప్రణాళికలను సిద్దం చేసుకోవాల్సి వున్నదని సిఎం తెలిపారు. “నేను రెండు నెల్లల్లో నిజామాబాద్ వస్త. మీరు చేసిన పనులను పరిశీలిస్త. అందమైన నిజామాబాద్ ను తీర్చిదిద్దాలె’’ అని సిఎం అన్నారు.

- Advertisement -

రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను ఆ శాఖ మంత్రి కెటిఆర్ సిఎం కు వివరించారు. దేశంలోనే ఆదర్శవంతమైన పట్టణాలను తీర్చిదిద్దడంలో మున్సిపల్ శాఖ కృషిని వివరించారు. నిజామాబాద్ నగరంలో ఆడిటోరియం నిర్మాణానికి సంబంధించిన వివరాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సందర్భంగా సిఎం కు వివరించారు. నిజామాబాద్ నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ఎమ్మెల్సీ కవిత సిఎం ను అభ్యర్థించారు. నగరంలో బస్టాండ్ నిర్మాణానికి విశాలమైన స్థలం, పిల్లలు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణ నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత సిఎం కు వివరించారు. హజ్ భవన్ నిర్మాణం చేపట్టాలని సిఎం ను కోరారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కెటిఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కవిత, వెంకట్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్ తో పాటు, జీవన్ రెడ్డి, రోహిత్ రెడ్డి, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ , డైరక్టర్ సత్యనారాయణ, నిజామాబాద్ కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ చిత్ర తో పాటు నిజామాబాద్ జిల్లా పంచాయతీ రాజ్, రోడ్లు భవనాలు, ఇరిగేషన్, రెవెన్యూ, పబ్లిక్ హెల్త్ ….తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement