Wednesday, May 1, 2024

అడుగుదూరంలో 60 ఏళ్ల క‌ల – శ‌ర‌వేగంగా పాల‌మూరు – రంగారెడ్డి ప‌నులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దశాబ్దాల ప్రజల నిరీక్షణ అనం తరం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగం పుంజు కున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసేందుకు సాగునీటి పారుదల శాఖ ఇంజనీర్లు నిగ్నమయ్యారు. ప్యాకేజీలవారిగా పనుల విభజన చేసి పనుల్లో వేగం పెంచారు. ప్రధానంగా భూసే కరణ, విద్యుత్‌ సరఫరా కోసం సబ్‌ స్టేషన్ల నిర్మాణాలు, ప్రధాన కాలువలు, సొరంగాల నిర్మాణాల పనుల్లో వేగం పెంచారు. 90 టీఎంసీల కృష్ణా జలాలతో 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జూన్‌ వరకు వట్టెం, జులైలో కరివెన, సెప్టెంబర్‌ నాటికి ఉద్దండాపూర్‌ జలాశయాలకు నీటిని చేర్చేందుకు ప్రధానకాలువల తవ్వకాలు జోరందుకున్నాయి. ప్యాకేజీ ఒకటిలో పంపుహౌస్‌ల నిర్మాణాలు చేపట్టగా ఇప్పటికే రెండు పూర్తి అయ్యాయి. ఈ పంపు హౌస్‌ నుంచి నార్లాపూర్‌ రిజర్వా యర్‌కు నీటిని ఎత్తిపోసే పనులు కొనసాగుతున్నాయి. అలాగే ప్యాకేజీ 3, 4లో నార్లాపూర్‌ ఏదుల జలాశయానికి మధ్య ప్రధాన కాలువ, రెండు సొరంగాల పనులు చేపట్టాల్సి ఉండగా ప్రస్తుతం ఒక సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఈ సొరంగం పనులు జూన్‌ చివరినాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు. మరో సొరంగానికి భూసేకరణ జరుగుతోంది. ప్యాకేజీ 5, 6లో ఇప్పటికే దాదాపు 65శాతం పనులు పూర్తి కాగా మిగతా పనుల కోసం భూసేకరణపై దృష్టి సారించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా వట్టెం జలాశయం నుంచి కరివెన జలాశయానికి వెళ్లే 12 కిలోమీటర్ల కాలువ నిర్మాణం జరుగుతుండగా ఈ పనుల్లో 100 మీటర్ల భూసేకరణ జరగాల్సి ఉంది. అలాగే కరువెన జలాశయం పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ఈ రిజర్వాయర్‌ పనుల్లో సిమెంట్‌ కాంక్రీట్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కరివెన జలాశయం నుంచి ఉద్దండాపూర్‌ జలాశయం వరకు నీటిని తరలించేందుకు ఎనిమిది కిలోమీటర్ల మేర రెండు సొరంగాల పనులు కొవసాగుతున్నాయి. అలాగే ఉద్దండా పూర్‌ జలాశయం నుంచి వికారాబాద్‌ జిల్లాలోని చేవెళ్ల వరకు ప్రతిపాదించిన కాలువ నిర్మాణం కోసం తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5,680 కోట్లు మంజూరు చేసింది.

ఈ ప్రాజెక్టు ను భూత్పూర్‌ మండలంలోని కరివెన దగ్గర నిర్మాణ పనులు 2015లో సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. అయితే ఆంధ్ర అభ్యంతరాలతో ప్రాజెక్టు పనుల్లో అంతరాయం కలగడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీకోర్టును ఆశ్రయించగా కోర్టు ఇచ్చిన స్టేతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి.
ఈ ప్రాజెక్టులో భాగంగా 7.95 టీఎంసీల సామర్ధ్యంతో నార్లాపూర్‌, 5.91 టీఎంసీల నీటి సామర్ధ్యంతో ఏదుల, 14.47 టీఎంసీల సామర్ధ్యంతో వట్టెం, 16.9 టీఎంసీలతో కరివెన, 15.61టీఎంసీతో ఉద్దండాపూర్‌, 2.6టీఎంసీల నీటితో లక్ష్మీదేవిపల్లి జలాశయం నిర్మాణాల పనులు కొనసాగుతు న్నాయి. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఈ జలాశయాలతో ప్రధానంగా నల్గొండ జిల్లాలోని వందలాది ప్లోరైడ్‌ ప్రాంతా లకు శాశ్వత రక్షిత మంచినీటిని సరఫరాచేసే అవకాశం కలుగు తుంది. అలాగే కరువుతో తల్లడిల్లే మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశాలుండ టంతో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement