Friday, May 3, 2024

Congress – జ‌న‌జాత‌ర స‌భ‌కు స‌ర్వం సిద్ధం – మ‌రికాసేప‌టిలో తుక్కుగూడ‌లో ప్రారంభం

ఆ రెండు రాజకీయ పార్టీలకు “తుక్కుగూడ” ఉత్కంఠ!
టీ కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు?
మొన్నటి వరకు 15 మంది.. తాజాగా 24 మంది?
నిన్న స్వయంగా మంత్రి కోమటిరెడ్డి ప్రకటన!
సాయంత్రం 5 గంటల తర్వాత తేలనున్న విషయం?
భారాస, భాజపాల నుంచి ఎమ్మేల్యేలు, ముఖ్య నేతలు పలాయనం
సభ ప్రారంభానికి ముందుగానే నోవాటెల్ హోటల్ లో రాహుల్ తో భేటీ

హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అనేకమంది నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది గోడ దూకేశారు. ప్రతిపక్ష భారాస, భాజపాల నుంచి ఎమ్మేల్యేలు, ముఖ్య నేతలు పలాయనం చిత్తగించేందుకు సంసిద్దమై ఉన్నారు. ఏఐసీసీ అగ్రనేతల సమక్షంలో ఆ రెండు రాజకీయ పార్టీలకు చెందిన 24 మంది ముఖ్య నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో “తుక్కుగూడ” జనజాతర సభ ఉత్కంఠ రేపుతోంది. టీ కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు ఉంటాయని గత వారం రోజులుగా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు 15 మంది చేరుతున్నట్లు వార్తలు రాగా తాజాగా ఆ సంఖ్య 24 మందికి చేరుకుంది. ఆ జాబితాలో ఎమ్మేల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిన్న స్వయంగా మంత్రి కోమటిరెడ్డి ప్రకటించడం గమనార్హం. ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత విషయం తేలిపోనుంది.

చేరికల అంశాన్ని గోప్యంగా ఉంచుతున్న టీపీసీసీ

జనజాతర సభ సందర్భంగా బీఆర్ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చేరికల అంశాన్ని టీపీసీసీ గోప్యంగా ఉంచుతోంది. పార్టీ ముఖ్య నేతతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఓ నాయకుడికి మాత్రమే దీనిపై స్పష్టత ఉన్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేరే అవకాశం ఉందని.. నోవాటెల్‌ హోటల్‌లో రాహుల్‌ గాం«దీని ఎంపీ కె.కేశవరావు కలుస్తారని మాత్రం పేర్కొంటున్నాయి.

అధికంగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల పేర్లు?

మరోవైపు కాంగ్రెస్‌లో చేరేవారు వీరే అంటూ కొందరు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల పేర్లు ప్రచారం అవుతున్నాయి. కాలేరు వెంకటేశ్, కోవ లక్ష్మి, కాలె యాదయ్య, బండారి లక్ష్మారెడ్డి, గంగుల కమలాకర్, టి.ప్రకాశ్‌గౌడ్, మాణిక్‌రావు, డి.సు«దీర్‌రెడ్డి, అరికెపూడి గాం«దీ, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్‌ ఈ జాబితాలో ఉన్నట్టు చెప్తున్నారు. కానీ వీరిలో ఎందరు చేరుతారు, ఎవరు చేరుతారన్నది స్పష్టత లేదు. దీనిపై టీపీసీసీ ముఖ్య నాయకుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్‌కు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడమైతే ఖాయమే. అన్ని సన్నివేశాలను వెండితెరపై చూడాల్సిందే..” అని ఆ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.

- Advertisement -

కీలక నేతల పేర్లు గోప్యంగా..

మరోవైపు ఈ సభలోగానీ, అంతకుముందుగానీ కాంగ్రెస్‌ పెద్దల సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు పార్టీలో చేరుతారని అంటున్నారు. ఇందులో ముగ్గురి నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మిగతా వారంతా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. తుక్కుగూడ సభ ప్రారంభానికి ముందు నోవాటెల్‌ హోటల్‌లో రాహుల్‌ సమక్షంలో ఈ చేరికలు జరగొచ్చని.. తర్వాత వారు సభలో పాల్గొంటారని కాంగ్రెస్‌ వర్గాలు చెప్తున్నాయి. చేరేది ఎవరన్నదానిపై మాత్రం గోప్యత పాటిస్తున్నారు.

ప్రతిష్టాత్మకంగా జనజాతర.. అన్ని ఏర్పాట్లు పూర్తి..

టీపీసీసీ జనజాతర సభకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేపట్టింది. 70 ఎకరాల్లో సభా ప్రాంగణం, 550 ఎకరాల్లో పార్కింగ్‌ సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి.. సోనియా గాం«దీతో ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల శంఖారావానికి కూడా ఇదే ప్రాంగణాన్ని ఎంచుకోవడం గమనార్హం. ఇక ఎండలు మండిపోతున్న నేపథ్యంలో సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మంచినీటి కొరత రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంటు స్థానాల వారీ ఇన్‌చార్జులు, అసెంబ్లీ సమన్వయకర్తల సమన్వయంతో.. సభకు 10లక్షల మందికిపైగా తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని కా>ంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 100 రోజుల పాలన విజయాలను ప్రజలకు వివరించనున్నారు.

తెలంగాణకు ప్రత్యేక హామీలు

తుక్కుగూడ సభలో కాంగ్రెస్‌ జాతీయ స్థాయి మేనిఫెస్టో ‘పాంచ్‌ న్యాయ్‌’ను తెలుగులో విడుదల చేయనుంది. దీనితోపాటు రాహుల్‌ గాంధీ తెలంగాణకు ప్రత్యేక హామీలను ఇవ్వనున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో కలిపిన ఐదు భద్రాచలం సమీప గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని.. విభజన చట్టం హామీలన్నీ అమలు చేస్తామని హామీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఐటీఐఆర్‌ వంటి ఉపాధి ప్రాజెక్టును కేటాయిస్తామనే హామీ కూడా ఉంటుందని తెలిసింది.

శంషాబాద్‌ నుంచి నోవాటెల్‌కు రాహుల్, ఖర్గే..

రాహుల్‌ గాంధీ శనివారం సాయంత్రం 5 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్‌ హోటల్‌కు వస్తారు. కొంతసేపు పార్టీ నేతలతో భేటీ అయ్యాక.. తుక్కుగూడ సభకు చేరుకుంటారు. సభ ముగిశాక రాత్రి 7 గంటల సమయంలో శంషాబాద్‌ మీదుగా తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement