Friday, May 3, 2024

Gold coins: బాత్రూం కోసం గుంత తవ్వితే, బంగారు నాణేలు బయటపడ్డయ్​.. ఆఖరికి ఏమైందంటే!

నిజంగా లక్కంటే వీరిదే. ఎందుకంటే.. బాత్రూం కోసం గుంత తవ్వుతుంటే బంగారు నాణాలే దొరకాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్​లోని జౌన్ పూర్ జిల్లాలో వెలుగుచూసింది. నూర్జహాన్ ఫ్యామిలీ తమ ఇంట్లో బాత్రూం కట్టాలని ప్లాన్​ చేసింది. దీనికోసం తవ్వకాలు చేపట్టగా కళ్లు చెదిరిపోయేలా బంగారు నాణేలు బయటపడ్డాయి. కూలీలు తవ్విన గుంతలో ముందుగా ఓ రాగిపాత్ర కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అన్నీ పసిడి నాణేలు కనిపించాయి. అయితే.. వాటిని సొమ్ముచేసుకోవాలని ఆశించిన నూర్జహాన్ కుటుంబానికి పోలీసులు అడ్డుతగిలారు. బంగారు నాణేలు లభ్యమైన విషయాన్ని నూర్జహాన్ కుటుంబీకులు ఎంత గోప్యంగా ఉంచుదామని అనుకున్నా అది బట్టబయలైంది.

రాగిపాత్రను వెలికి తీసిన కూలీలకు, నూర్జహాన్ కుటుంబ సభ్యులకు మధ్య గొడవ జరిగింది. వాటా ఇచ్చేందుకు నూర్జహాన్ కుటుంబం ఒప్పుకోకపోవడంతో కూలీలు పని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు. వారు తిరిగి మరుసటి రోజు రాగా నూర్జహాన్ కుటుంబం వారికి ఓ బంగారు నాణెం ఇచ్చింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఊరంతా పాకిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ నాణేలను స్వాధీనం చేసుకున్నారు. అవి బ్రిటీష్ పాలన నాటివని గుర్తించారు. 1889-1920 మధ్య కాలం నాటివని వెల్లడైంది. కాగా, పోలీసులకు భయపడి కొందరు కూలీలు పరారీలో ఉన్నట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement