Sunday, April 28, 2024

TS: ఇంటిదగ్గరే ఓటింగ్​! పోస్ట‌ల్ బ్యాలెట్స్ చర్యలు..

మూడో తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ
వృద్ధులు, జ‌ర్నలిస్టులు, వికలాంగులు, విధుల్లో ఉన్న సిబ్బంది అర్హులు
తెలంగాణ‌లో మే 13న పోలింగ్
మొత్తం ఓట‌ర్లు 14 ల‌క్ష‌లకు పైనే
30వ తేదీ నుంచి పోస్ట‌ల్ బ్యాలెట్స్ ప్రింటింగ్
మొత్తం 15 ల‌క్ష‌ల పోస్ట‌ల్ బ్యాలెట్స్ ముద్ర‌ణ‌
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలక్షన్ కమిషన్ అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మే 3వ తేదీ నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తున్నారు. మే 13న పోలింగ్ జ‌రుగనున్న నేప‌థ్యంలో సాధారణ పోలింగ్‌‌కు నాలుగు రోజుల ముందుగానే ఈ పక్రియను పూర్తి చేయాల్సి ఉండడంతో 8వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించింది. దీంతో అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు.

30వ తేదీన పోస్ట‌ల్ బ్యాలెట్స్ ముద్ర‌ణ..
పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణను ఈనెల 30న మొదలు పెట్టి రెండో తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల సంఘం నిర్ణయించినట్టుగా పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను ఆయా జిల్లాల్లోనే ముద్రించనున్నాయి. కాగా, ఈవీఎం యంత్రాలపై ఉంచే బ్యాలెట్‌ పత్రాలను హైదరాబాద్‌లోనే ముద్రించాలని అధికారులు నిర్ణయించారు.


అర్హులు వీరే…
85 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. వృద్ధులతో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు, జ‌ర్న‌లిస్టులు, దివ్యాంగులు కూడా పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంది. ఈ అవకాశం ఎంచుకున్న దివ్యాంగులు, వయోవృద్ధులు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రెండో దఫా శిక్షణ సందర్భంగా ఏర్పాటు చేసే ఫెసిలిటీ కేంద్రంలో ఓటు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.


14ల‌క్ష‌ల‌కు పైగా పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట‌ర్లు..
తెలంగాణలో 85ఏళ్ల వయసు దాటినవారు 4.50 లక్షల మంది ఉన్నట్లు అంచనాగా ఉంది. ఇక దివ్యాంగ ఓటర్లు సుమారు 5లక్షలు, ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు 2.60లక్షల మంది ఉద్యోగులు ఉంటారని అంచనాగా ఉంది. మరోవైపు రాష్ట్రానికి చెందిన 15 వేల మందికిపైగా ఉద్యోగులు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారికి రిజిస్టర్‌ పోస్టు ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌‌ను పంపాల్సి ఉంటుంది. దీంతో లోక్‌సభ ఎన్నికలకు సుమారు 13 లక్షల పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను ముద్రించాలని అధికారులు నిర్ణయించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement