Thursday, April 25, 2024

రూ 4,411 కోట్లతో టీటీడీ బడ్జెట్ : టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి

తిరుమల : 2023- 24 ఆర్థిక సంవత్సరానికి రూ 4,411.68 కోట్ల బడ్జెట్ ను టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదించిందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసిందని ఆయన వివరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో ఎవి ధర్మారెడ్డితో కలసి బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులందరికీ శ్రీ శోభ కృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. స్వామి వారి దయ, ఆశీస్సులతో ప్రపంచంలోని ప్రజలందరూ, ముఖ్యంగా తెలుగు ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నాను అన్నారు. ఫిబ్రవరి నెల 15వ తేదీ టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించిన విషయం అందరికీ తెలుసు అన్నారు. ఈ సమావేశంలో 2023-24 బడ్జెట్ ఆమోదంతో పాటు కొన్ని పరిపాలనా పరమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింద‌న్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల ఆ వివరాలను వెల్లడించలేక పోయాము అన్నారు. కోడ్ ముగిసినందువల్ల ఈ రోజు మీడియా ద్వారా వివరాలు తెలియజేయడం జరుగుతోంది. విఐపి బ్రేక్ దర్శనం సమయం మార్చినందువల్ల సామాన్య భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ విధానాన్ని కొనసాగిస్తాం. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. కోవిడ్ కు ముందు ఏడాదికి రూ 1200 కోట్లు కానుకలు లభించేవి. కోవిడ్ తరువాత హుండీ ఆదాయం రూ 1500 కోట్ల దాకా పెరిగింది. బ్యాంకుల్లో ఉన్న టీటీడీ డిపాజిట్ల మీద కూడా వడ్డీ రేట్లు పెరిగాయి.

భక్తుల కోరిక మేరకు కోవిడ్ సమయంలో వర్చువల్ సేవా టికెట్లు ఆన్లైన్ లో జారీ చేశాము. తరువాత కూడా భక్తుల కోరిక మేరకు ఈ సేవలు కొనసాగించాలని నిర్ణయించామ‌న్నారు. తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ నిర్మాణం ఏప్రిల్ ఆఖరు నాటికి పూర్తి చేయించి ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తాం అన్నారు. అలిపిరి నుండి వకుళామాత ఆలయం వరకు కొత్తగా రోడ్డు మంజూరు చేశాము. ఏప్రిల్ 5వ తేదీ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి వారి కళ్యాణోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. వేసవిలో మూడు నెలలు భక్తుల రద్దీ బాగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల వి ఐ పి ల రెఫరల్స్ బాగా తగ్గించాలని కోరుతున్నామ‌న్నారు. శ్రీవాణి టికెట్ల సంఖ్య కూడా తగ్గించి ఎక్కువమంది సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తాము. తిరుమల లో భక్తుల అవసరాలకు అనుగుణంగా లడ్డూ కాంప్లెక్స్ వద్ద 30 అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి రూ 5.25 కోట్లు మంజూరు చేశామ‌న్నారు. తమిళనాడు రాష్ట్రం ఊలందూరు పేటలో దాత విరాళంతో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రూ 4.70 కోట్లతో కొన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి నిర్ణయించాము. తిరుపతి లోని ఎస్ జి ఎస్ ఆర్ట్స్ కళాశాల పడమరవైపు మూడో అంతస్తు నిర్మాణం, ల్యాబ్ ఆధునీకరణ, గ్రంథాలయం, ఇండోర్ గేమ్స్ భవనాల నిర్మాణం తదితర పనుల కోసం రూ. 4.71 కోట్లతో టెండర్లు ఖరారు చేశామ‌న్నారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ లో పని చేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులతో కలిపి దర్శన వసతి, రాయితీపై రూ 20 చొప్పున నెలకు 10 లడ్డూలు అందించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement