Saturday, July 27, 2024

TS | ధరణిపై త్వరలో శ్వేత పత్రం : మంత్రి పొంగులేటి

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ : ధరణిపై త్వరలో శ్వేత పత్రం దిశగా ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అక్రమాలను నిగ్గుతేల్చడంతోపాటు, గత పెద్దల భూ అక్రమాలను వెలుగులోకి తేవాలని భావిస్తోంది. ఈ క్రమంలో యావత్‌ ధరణి ప్రాజెక్టు లీలలపై ప్రభుత్వం పకడ్బంధీగా ముందుకు వెళుతోంది. పెద్దలు, ఐఏఎస్లు, ఐపీఎస్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల భూ మేత బండారాన్ని బైటపెట్టనున్నట్లు ప్రకటించింది. ఇరిగేషన్‌, ఆర్ధిక, విద్యుత్‌ శాఖలపై విడుదల చేసినట్టుగానే త్వరలో ధరణిపై కూడా శ్వేత పత్రం విడుదల చేయబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడించారు.

ధరణి పోర్టల్‌ ను పుర్తిగా ప్రక్షాళన చేస్తామని, ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మార్చి 1 నుంచి 7వ తేది వరకు సదస్సులు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎంతో గొప్పగా చెప్పుతున్న ధరణి పోర్టల్‌లో రైతులు, రైతు కూలీలకు ఉన్న ఐదు గుంటలు, పది గుంటలు భూమి కూడా సమస్యలలోకి నెట్టబడిందన్నారు. ఆలోచన రహితంగా ధరణి ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రభుత్వ భూములను వారి సొంత భూములుగా మార్చుకోవడానికే కుట్రపూరితంగా ధరణిని ప్రవేశపెట్టారని విమర్శించారు.

ధరణికి సంబంధించి గత ప్రభుత్వ పెద్దలు ఎన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసారో, ఎన్ని లక్షల కోట్ల ప్రజల సొత్తును కొల్లగొట్టారో త్వరలో ప్రజలముందు పెట్టబోతున్నామని తెలిపారు. భూరికార్డులకు శరాఘాతంగా పరిణమించిన ధరణి పోర్టల్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నామని తెలిపారు.

సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగం యుూనివర్సిటీలో ”తెలంగాణ పునర్నిర్మాణం” పై నిర్వహించిన సెమినార్‌లో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూశాఖ, ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌ లో ఉన్నాయని, వీటి పరిష్కారానికి మార్చి 1 నుండి 7వరకు ఎమార్వో స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

నీళ్ళు, నిధులు, నియామకాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే కే.సి.ఆర్‌. పాలనలో తీరని నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేసారు. ముఖ్యంగా ఉద్యోగ నియామకాల విషయంలో అశ్రద్ధ వహించారని, చిత్తశుద్ధిగా వ్యవహరించలేదని, నిరుద్యోగ కుటు-ంబాలతో చెలగాటం ఆడారని విమర్శించారు. నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే, ఒక క్యాబినెట్‌ మంత్రి అవహేళనగా మాట్లాడారు. అప్పటి ప్రభుత్వ విధానాలతో స్వార్థంకోసం టీఎస్పీఎస్సి పేపర్‌ లీకేజీలతో నిరుద్యోగ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని అన్నారు.

- Advertisement -

ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ…

ఏడాదిలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను, భర్తీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఏడాదిలోపే అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే 23వేల ఉద్యోగాలను భర్తీ చేసామని, మార్చి 2వ తేదిన వివిధ విభాగాలకు సంబంధించి ఆరువేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. త్వరలో మెగా డీఎస్సీని కూడా ప్రకటించబోతున్నామని తెలిపారు.

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసామని, అనుభవమైన నిజాయితీ గల అధికారులను నియమించామన్నారు. నీటి పారుదల అంశంలో ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరిగేల నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ పెద్దలు 80వేల పుస్తకాలు చదివానని, తానే ఇంజనీర్‌ను, తానే తాపీ మేస్త్రీ, తానే ఒక డిజైనర్‌ను అంటూ ప్రపంచ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా నిర్మించానని ప్రచారం చేసుకున్న ఆ పెద్దమనిషి ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.

లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రపంచ అద్భుతం నేడు కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేసారు. గత ప్రభుత్వ అవినీతికి కాళేశ్వరం ఒక నిదర్శనం అన్నారు. ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ప్రారంభించిన జలయజ్ఞంలో భాగంగా గోదావరి, కృష్ణా నదులమీద చేపట్టిన ప్రాజెక్టులను ఆనాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రీ-డిజైన్‌ పేరుతో దోచుకుని ధనిక రాష్ట్రాన్ని, రూ. 7లక్షల కోట్ల అప్పులోకి నెట్టారని, ప్రతి తెలంగాణ బిడ్డపైన అప్పుల భారాన్ని మోపిన ప్రభుద్దులు గత ప్రభుత్వ పెద్దలని దుయ్యబట్టారు.

త్వరలో మరో రెండు గ్యారంటీలు…

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను ఒక్కొక్కటి సరిచేసుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దాలను అమలు చేస్తున్నామని అధికారంలో వచ్చిన రెండు రోజుల్లోనే, రెండు గ్యారంటీలను అమలు చేసామని ఈ నెల 27న మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు.

యూనివర్సిటీలలో ఖాళీలను సైతం భర్తీ చేస్తామని, ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలను త్వరలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో తెలంగాణ ఊహించని రీతిలో విధ్వంసానికి గురి అయిందన్నారు. అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసారో చెప్పడానికి కాగ్‌ రిపోర్టు నిదర్శనమన్నారు. పదేండ్లపాటు అధికారాన్ని వారి స్వప్రయోజనాలకు వాడుకున్నారని విమర్శించారు.

ముప్పై ఏళ్ళ తర్వాత ఆర్ట్స్‌ కాలేజీ కి అధికార హోదాలో క్యాబినెట్‌ మంత్రి

ముప్పై సంవత్సరాల క్రితం క్యాబినెట్‌ మంత్రి హోదాలో సమాచార శాఖ మంత్రిగా డి.శ్రీనివాస్‌, ఉస్మానియా యూనివర్సిటీ లోని ఆర్ట్స్‌ కాలేజీకి వెళ్ళారు. అప్పట్లో యూనివర్సిటీ అధికారులు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏ మంత్రి కూడా యూనివర్సిటీకి వెళ్ళలేదు. వెళ్ళే సాహసం కూడా చేయలేదు. గతంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హైదరాబాద్‌లో పర్యటించి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఓయూకు వచ్చిన సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్‌ హాజరయ్యారు. ఇప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత క్యాబినెట్‌ మంత్రి హోదాలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం నాడు అడుగు పెట్టి గతాన్ని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement