Saturday, July 27, 2024

Delhi: నేటి సాయంత్రమే మోడీ కేబినెట్ తొలి భేటీ….

వంద‌రోజుల కార్య‌చ‌రణ‌పై చ‌ర్చ‌
మంత్రుల శాఖ‌ల కేటాయింపు కూడా
ముఖ్య శాఖ‌లు కోరుతున్న మిత్రప‌క్షాలు
కీల‌క శాఖ‌ల‌న్నీ బీజేపీ వ‌ద్దే
స్పీక‌ర్ ఎన్నిక‌లపై కేబినెట్ లో చ‌ర్చ‌

కేం‍ద్రంలో కొత్త కేబినెట్‌ కొలువుదీరే సమయం వచ్చింది. ప్రధాని మోడీ సహా కొత్త మంత్రులంతా ఇప్పటికే ప్రమాణం చేసేశారు. ఇక నేటి సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కొత్త కేంద్రమంత్రి వర్గం భేటీ కానుంది. ఈ భేటీలో కొత్త ప్రభుత్వం వంద రోజుల కార్యాచరణపై ఆయన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. అలాగే స్పీకర్‌ ఎన్నిక తదితర అంశాల కోసం పార్లమెంట్‌ సమావేశం నిర్వహించాలని సిఫార్సు చేసి.. దానిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించే యోచనలోనూ ఉన్నారు.


శాఖ‌లు కేటాయింపు నేడే…
ఇక ఈ భేటీలోనే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపుపై స్పష్టత రానుంది. భాగస్వామ్య పక్షాలు ఆశిస్తున్న శాఖల అంశాన్ని పరిగణలోకి తీసుకున్న బీజేపీ.. వ్యూహాత్మక నిర్ణయంతోనే ముందుకు సాగనున్నది. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలను తమ దగ్గరే అంటిపెట్టుకోనుంది బీజేపీ. అలాగే మూడో దఫా ప్రభుత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులపై ప్రధాన ఫోకస్ ఉంటుందనే గతంలోనే మోదీ ప్రకటించారు. దీంతో దీని పరిధిలోకి వచ్చే శాఖలు కూడా బీజేపీ చేతిలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది.


మోదీ కేబినెట్ లో 27 మంది బీసీలు..
మంత్రివర్గ కూర్పులో ప్రధాని మోడీ కులసమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. అలాగే త్వరలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక కొత్త మంత్రుల్లో 27మంది బీసీలు ఉన్నారు. ఐదుగురు మైనారిటీలు, ఏడుగురు మహిళలు ఉన్నారు.

- Advertisement -


మిత్ర పక్షాల కొర్కెల చిట్టా…
ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు సైతం తమ తమ ప్రయోజనాల దృష్ట్యా ముఖ్య‌ శాఖల్నికోరుతున్నాయి. జేడీఎస్‌ కుమారస్వామి వ్యవసాయ శాఖ కోరారు. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే శాఖల్ని కోరామని మరో మిత్రపక్షం టీడీపీ ఇది వరకే ప్రకటించుకుంది. అలాగే..జేడీయూ, ఇతర పార్టీలు సైతం పలు శాఖల్ని డిమాండ్ చేశాయి. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీయే ఎంపీల సమావేశం జరుగుతున్న టైంలోనే మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో మిత్రపక్ష నేతలతో మంత్రివర్గ కూర్పు, ఎవరికి ఏయే శాఖల వంటి అంశాలపై చర్చలు జరిగి, ఇప్ప‌టికే ఓ నిర్ణయం కూడా తీసుకుంది.. దానికి అనుగుణంగా నేడు శాఖ‌లు కేటాయించ‌నున్నారు మోదీ..


తొమ్మిది బెర్త్ లు ఖాళీ…
ఇదిలా ఉంటే మోడీ కేబినెట్ లో 72మంది మంత్రులుండ‌గా .. ఇందులో 30మంది కెబినేట్ మంత్రులుగా, ఐదుగురికి స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు ఉన్నారు.. ఇంకా కేంద్ర కేబినెట్‌లో 9బెర్తులు ఖాళీగాను ఉన్నాయి.. వాటిని త్వ‌ర‌లోనే మోదీ భ‌ర్తీ చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement