Monday, April 29, 2024

Tenth, Inter: ఏడాదికి రెండు సార్లు ప‌రీక్ష‌లు… కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్

రాయ్‌పూర్‌: నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఏడాదిలో రెండు సార్లు టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. దీన్ని వచ్చే ఏడాది ప్రారంభమయ్యే అకడమిక్‌ సెషన్‌ నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్‌ రైజింగ్‌ ఇండియా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. 2025-26 అకడమిక్‌ సెషన్‌ నుంచి పది, 12వ తరగతి బోర్డు పరీక్షలను విద్యార్థులు ఏడాదిలో రెండు సార్లు రాసే వీలు కల్పించనున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇందులో ఉత్తమ స్కోరును ఎంచుకునే అవకాశం ఉంటుంద‌న్నారు. విద్యార్థులను ఒత్తిడికి దూరం చేసి నాణ్యమైన విద్యను అందించడమే త‌మ‌ సర్కారు లక్ష్యమ‌న్నారు. ఈ ఫార్ములా దేశాన్ని 2047 నాటికి వికసిత భారతంగా తీర్చిదిద్దుతుంద‌నే ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు..

పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ గతేడాది ఆగస్టులో కొత్త కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం.. టెన్త్‌, ఇంటర్‌ బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని ప్రతిపాదించారు. ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు ప్రిపేర్‌ అయ్యేందుకు తగినంత సమయం దొరకడంతో పాటు మంచి పనితీరు కనబరిచేందుకు వీలుంటుందని విద్యాశాఖ పేర్కొంది.

- Advertisement -

అయితే, పరీక్షలు సెమిస్టర్‌ పద్ధతిలో పెడతారా, లేక మొత్తం సిలబస్‌పై రెండుసార్లు నిర్వహిస్తారా? అనే విషయంపై స్పష్టత లేదు. ఇక, కొత్త ఫ్రేమ్‌వర్క్‌ ప్రకారం.. 11, 12 తరగతుల విద్యార్థులు రెండు లాంగ్వేజ్‌లను కచ్చితంగా అభ్యసించాలని, వాటిలో ఒకటి భారతీయ భాష అయి ఉండాలని మాత్రం నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement