Sunday, April 28, 2024

గాంధీభ‌వ‌న్ లో ఉద్రిక్త‌త.. చొక్కాలు ప‌ట్టుకుని నెట్టుకున్న నేత‌లు.. స‌ర్దిచెప్పిన మ‌ల్లు ర‌వి

హైద‌రాబాద్ గాంధీభ‌వ‌న్ లో ఉద్రిక్త‌త నెల‌కొంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఏర్ప‌డిన సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గాంధీభవన్ లో పార్టీ నేతలతో చర్చిస్తుండగా, వెలుపల తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఉత్తమ్ కుమార్ ను తిడతావా అంటూ పీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే అనిల్ ను ఓయూ విద్యార్థి కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. అనిల్ క్షమాపణ చెప్పాలంటూ ఓయూ విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చొక్కాలు పట్టుకుని నెట్టుకున్నారు.

ఒకరిపై ఒకరు దాడికి యత్నించారు. ఈ దశలో సీనియర్ నేత మల్లు రవి వచ్చి సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం మల్లు రవి మాట్లాడుతూ, ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఇలాంటి గొడవలు, కొట్టుకోవడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని శిరసు వంచి కోరుతున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలపై పోరాటం కోసం మీ శక్తినంతా వినియోగించాలి అంటూ శ్రేణులకు పిలుపునిచ్చారు. నేతల మధ్య భేదాభిప్రాయాలను దిగ్విజయ్ సింగ్ పరిష్కరిస్తారని మల్లు రవి వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement