Saturday, April 20, 2024

Delhi | పులుల సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం విఫలం : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పులుల సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పులుల సంరక్షణ, పోషణకు బడ్జెట్‌లో ప్రకటించిన 2.2 కోట్ల నిధులను రాష్ట్ర వాటాలో భాగంగా కేటాయించలేదని ఆరోపించారు. ఈమేరకు శనివారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. మనదేశంలో పులుల సంరక్షణను ప్రోత్సహించడానికి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) ద్వారా 50 ఏళ్ల క్రితం ఏప్రిల్ 1, 1973న కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ టైగర్’ ప్రారంభిందని తెలిపారు. వన్యప్రాణుల ఆవాసాల సమగ్రాభివృద్ధి పథకంలో ఓ భాగమైన ప్రాజెక్ట్ టైగర్ 18 టైగర్ రేంజ్ రాష్ట్రాల్లో అమలవుతోందని చెప్పారు. తెలంగాణలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ 2,015.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండగా, అమ్రాబాద్ సాంక్చురీ 2,611.39 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని, ఇవి కాకుండా 3,296.31 చ.కి. కి.మీ విస్తీరణంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ విస్తరించి ఉందని ప్రకటనలో పేర్కొన్నారు.

వివిధ ప్రాయోజిత పథకాలలో భాగంగా కేంద్రం రూ.30 కోట్లు బదిలీ చేసిందని వెల్లడించారు. ఇవి కాకుండా కేంద్రం తెలంగాణకు  కాంపెన్సేటరీ ఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా) కింద రూ. 3,110 కోట్లు విడుదల చేసిందని కిషన్‌రెడ్డి వివరించారు. తమది భారీ బడ్జెట్ అని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పులుల సంరక్షణకు కోటి రూపాయలు కూడా విడుదల చేయకపోవడం విచారకరన్నారు. దానివల్ల కవ్వాల్, అమ్రాబాద్‌ రిజర్వ్‌ లో అగ్నిమాపక కార్యకలాపాలు, ఇతర అవసరమైన కార్యక్రమాలకు సరైన ఆర్థిక సహాయం అందడం లేదని ఆయన ఆరోపించారు.

నిధుల బదిలీ విధానం ప్రకారం భారత ప్రభుత్వం తన వాటా నిధులను నాలుగు విడతలుగా బదిలీ చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వాటాను స్వీకరించిన నెల రోజుల్లోపు రాష్ట్రం తన వాటాను విడుదల చేయాల్సి ఉన్నా అది జరగకపోవడం వల్ల టైగర్ రిజర్వ్‌లకు తీవ్రమైన నిధుల కొరత ఏర్పడుతోందని కేంద్రమంత్రి తెలిపారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ నిధులను విడుదల చేసి దేశంలో పులుల సంఖ్యను పెంచేందుకు కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతగా నిలవాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement