Friday, May 17, 2024

TS | మహబూబ్‌నగర్ నుంచి తన తమ్ముడి పోటీ… రేవంత్ రెడ్డి క్లారిటీ !

రానున్న లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సోదరుడు మహబూబ్ నగర్ నుంచి బరిలోకి దిగుతున్నట్లుగా ప్రచారం సాగింది. అయితే తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ… తన తమ్ముడి పోటీ చేయడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. అలాగే మోదీని పెద్దన్నగా పేర్కొనడంపై బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. దీంతో తనది అంతా బహిరంగమే అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజుకు రెండున్నర కోట్ల ఇసుక ఆదాయం పెరిగినట్లు రేవంత్ చెప్పారు. జీఏస్టీ ఆదాయం రూ.500 కోట్లు పెరిగినట్టు పేర్కొన్నారు. ఎల్‌ఆర్ఎస్‌పై అధికారుల నివేదిక వచ్చాక స్పష్టత ఇస్తామన్నారు. సీఏంఆర్ఎఫ్‌పై ఇంటర్నల్ ఆడిట్ జరుగుతోందని… ఆ తర్వాత చర్యలు ఉంటాయన్నారు. తమ పరిపాలనే రిఫరెండంగా లోక్ సభ ఎన్నికలకు వెళతామన్నారు. 17కు గాను 14 లోక్ సభ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ట్యాక్స్ పేయర్స్‌కు రైతుబంధు ఎందుకు అని ప్రశ్నించారు. వ్యవసాయం చేసే వారికి మాత్రమే రైతుబంధు ఉండాలన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

ప్రభుత్వం ఎందుకు పడిపోతుంది?

తమ ప్రభుత్వం పడిపోతుందని చెప్పేవారు అలా ఎందుకు పడిపోతుందో చెప్పాలని నిలదీశారు. అసెంబ్లీకి రాని నేత ప్రతిపక్ష నేత ఎలా అవుతారు? అని ప్రశ్నించారు. ప్రధాని అంటే దేశానికి పెద్దన్న అనేది వాస్తవమే కదా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను కాళేశ్వరంపై నాలుగు వారాల్లో నివేదిక ఇస్తే ఎన్నికల లోపే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తుమ్మిడిహెట్టి నిర్మించి ఆదిలాబాద్‌కు నీళ్లు తెస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అంతర్గత ఒప్పందంతో టిక్కెట్లను ప్రకటిస్తున్నాయని ఆరోపించారు. మెదక్‌లో బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదు? అని నిలదీశారు. ఏడో తేదీన ఈసీ సమావేశం ఉందని… అదే రోజు పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉండవచ్చునని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement