Friday, March 29, 2024

గవర్నర్‌ను తక్షణం తొలగించండి.. రాష్ట్రపతికి డీఎంకే లేఖ

తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రశాంతతకు ముప్పుగా ఆయన్ను అభివర్ణించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజలకు సేవలందించకుండా అడ్డుకుంటున్నారని మండిపడింది. ఆయనను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ వినతిపత్రాన్ని పంపించింది. ఆర్‌ఎన్‌ రవి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేటపుడు రాజ్యాంగాన్ని, చట్టాన్ని పరిరక్షిస్తానని, కాపాడతానని ప్రమాణం చేశారని, ఆ ప్రమాణాన్ని ఆయన ఉల్లంఘిస్తున్నారని వినతిపత్రంలో డీఎంకే ఆరోపించింది.

మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, శాసన సభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని పేర్కొంది. ప్రభుత్వం పట్ల అసంతృప్తిని రగిలించే విధంగా మాట్లాడుతున్నారని, అటువంటి వ్యాఖ్యలను రాజద్రో#హంగా కొందరు పరిగణించే అవకాశం ఉందని తెలిపింది. రాజ్యాంగ పదవికి ఆయన అనర్హుడని పేర్కొంది. ఈ మెమెరాండంపై డీఎంకే అధిష్ఠాన వర్గం నేతలు, ఆ పార్టీ మిత్ర పక్షాల నేతలు సంతకాలు చేసినట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. ఈ మెమొరాండంను ఈ నెల 2న రాసినట్లు సమాచారం. డీఎంకే ఇటీవల భావసారూప్యతగల ఎంపీలకు ఓ లేఖ రాసింది. రవిని గవర్నర్‌ పదవి నుంచి తొలగించాలనే తమ ప్రతిపాదనకు మద్దతివ్వాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement