Sunday, May 19, 2024

New Rule | 16 ఏళ్ళ లోపు వారికి కోచింగ్ సెంటర్లలో నో ఎంట్రీ – కేంద్రం ఆదేశం

విద్యార్థుల ఆత్మహత్యలు, సౌకర్యాల లేమి, టీచర్ల కొరత, అధిక ఫీజులు వంటి సమస్యలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కోచింగ్‌ సెంటర్‌లకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. 16 ఏళ్ల వయసు కంటే తక్కువ ఉన్న విద్యార్ధులను కోచింగ్‌ సెంటర్‌లో చేర్చుకోరాదని వెల్లడించింది. సెకండరీ పాఠశాల విద్యను పూర్తి చేసుకున్న తరువాత మాత్రమే విద్యార్ధులను చేర్చుకునేందుకు అనుమతినిచ్చింది.

  • శిక్షణ కేంద్రాల్లో విద్యార్హత కలిగిన సిబ్బందిని నియమించుకోవాలి. వారు తప్పనిసరిగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ కంటే తక్కువ అభ్యసించిన వారిని సిబ్బందిగా నియమించుకోరాదు.
  • విద్యార్థుల తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా.. ర్యాంకులు, మార్కుల గురించి ఎలాంటి హామీలు ఇవ్వకూడదు.
  • సిబ్బంది అర్హత, కోచింగ్‌ సెంటర్‌ వివరాలు, శిక్షణ అందించే కోర్సులు, వసతి సౌకర్యాలు, ఫీజు రిఫండ్‌ గురించిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరచాలి.
  • కోచింగ్‌ సెంటర్‌లో ఇచ్చే శిక్షణకు సంబంధించి, అక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు సాధించిన ఫలితాల గురించి మోసపూరిత ప్రకటనలు చేయకూడదు.
  • కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులకు సరిపోయే స్థలం కేటాయించి కనీస సౌకర్యాలు(విద్యుత్‌, వెంటిలేషన్, లైటింగ్, స్వచ్ఛమైన తాగునీరు,భద్రతా చర్యలు’ ఏర్పాటు చేయాలి.
  • అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం నివారించేందుకు భద్రతా ప్రమాణాలు పాటించాలి.
  • శిక్షణ ఇచ్చే వ్యక్తి లేదా సంస్థ కోచింగ్‌ ప్రారంభించిన మూడు నెలల వ్యవధిలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
  • ఒకవేళ మార్గదర్శకాలకు విరుద్ధంగా నిర్వహిస్తుంటే.. గుర్తింపు రద్దవుతుంది.
  • ఒకే పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో శిక్షణ ఇచ్చే సంస్థలు తప్పనిసరిగా ఆయా బ్రాంచ్‌లను రిజిస్ట్రేషన్‌ చేయాలి.
  • కోచింగ్‌ తీసుకునే విద్యార్థులకు కెరీర్‌ గైడెన్స్‌తో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
  • న్యాయమైన, సహేతుకమైన ఛార్జీలు, రుసుము రసీదులు, వాపసు విధానాలు వివరంగా ఉండాలి.
Advertisement

తాజా వార్తలు

Advertisement