Sunday, May 5, 2024

Namo Bharat RapidX – తొలి సెమీ హైస్పీడ్ రైలుకు ప్రారంభించిన ప్ర‌ధాని మోడీ..

గాజియాబాద్‌: దేశీయ తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్‌ రైలు ‘నమో భారత్‌ ‘ పట్టాలపై పరుగులుపెట్టింది. ఉత్తరప్రదేశ్లోని సాహిబాబాద్‌ స్టేషన్‌లో దిల్లీ-గాజియాబాద్‌-మేరఠ్‌ రీజినల్‌ రాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్ కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం తొలి ర్యాపిడ్‌ఎక్స్‌ రైలుకు ప్రధాని జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తదితరులు పాల్గొన్నారు.
రైలును ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ అందులో ప్రయాణించారు. స్కూల్ విద్యార్థులు, ర్యాపిడ్‌ఎక్స్‌ రైలు సిబ్బందితో ముచ్చటించారు. గంటకు 180 కి.మీ.గరిష్ఠ వేగంతో దూసుకెళ్లేలా తీర్చిదిద్దిన ఈ రైలులో అధునాతన సదుపాయాలు ఉంటాయి. దిల్లీ- గాజియాబాద్‌- మేరఠ్‌ మధ్య రూ.30,000 కోట్లతో చేపట్టిన ‘ప్రాంతీయ శీఘ్ర రవాణా వ్యవస్థ’ (రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌) కారిడార్‌లో సాహిబాబాద్‌-దుహై డిపో మధ్య ముందుగా 17 కి.మీ. దూరానికి ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. ఈ రెండింటి మధ్య అయిదు స్టేషన్లు ఉంటాయి.

పూర్తిగా ఏసీ బోగీలే
ఇవి పూర్తిగా ఎయిర్‌ కండిషన్డ్‌. ప్రతి రైలులో 2-2 లేఅవుట్‌లో సీట్లు, నిలబడేందుకు విశాలమైన ప్రదేశం, లగేజ్‌ ర్యాక్‌లు, సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ డోర్‌ ఓపెనింగ్‌ మెకానిజం, ల్యాప్‌టాప్‌ లేదా మొబైల్‌ ఛార్జింగ్‌పాయింట్లు, డైనమిక్‌ రూట్‌ మ్యాప్‌లు, ఆటో కంట్రోల్‌ యాంబియంట్‌ లైటింగ్‌ సిస్టమ్‌, హీటింగ్‌ వెంటిలేషన్‌, ఎయిర్‌ కండిషనింగ్‌ సిస్టమ్‌తో పాటు అనేక సదుపాయాలు ఈ రైళ్ల ప్రత్యేకత. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు చొప్పున సర్వీసులందిస్తాయి.
ప్రతి రైలులో ఆరు కోచ్‌లు ఉంటాయి. ఏకకాలంలో 1700 మంది కూర్చొని, నిలబడి ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. స్టాండర్డ్‌ కోచ్‌లో 72 సీట్లు, ప్రీమియం కోచ్‌లో 62 సీట్లు చొప్పున ఉంటాయి. స్టాండర్డ్‌ కోచ్‌లలో కనీస టికెట్‌ ధర రూ.20 కాగా.. గరిష్ఠ ధర రూ.50గా నిర్ణయించారు. అలాగే, ప్రీమియం కోచ్‌లలో అయితే కనీస టికెట్‌ ధర రూ.40 కాగా.. గరిష్ఠ ధర రూ.100గా నిర్ణయించారు. ప్రీమియం కోచ్‌లో వెనుకకు వాలి కూర్చొనేలా సీట్లతో పాటు కోట్‌ హుక్స్‌, మ్యాగజైన్ హోల్డర్‌లు, ఫుట్‌రెస్ట్‌లు వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
ఈ రైళ్లు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలందిస్తాయి. పావుగంటకు ఒకటి చొప్పున నడుస్తాయి. తర్వాత అవసరాన్ని బట్టి అయిదు నిమిషాలకొకటి నడుపుతారు. ప్రతి రైలులో ఆరు కోచ్‌లు ఉంటాయి . ప్రతి రైలులో ఒక కోచ్‌ను మహిళలకు కేటాయించారు. మహిళలు, దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రతి కోచ్‌లోనూ కొన్నిసీట్లను కేటాయించారు. . ప్రీమియం కోచ్‌లో ప్రయాణికులకు సహాయపడేందుకు ఒకరు అందుబాటులో ఉంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement