Monday, May 6, 2024

Mystery Gun Fire – కేంద్ర‌మంత్రి ఇంటిలో కాల్పులు…యువ‌కుడి మృతి..

ల‌క్నో – కేంద్ర మంత్రి ఇంటిలో జ‌రిగిన కాల్పుల‌లో ఒక యువ‌కుడు మ‌ర‌ణించాడు.. మంత్రి కుమారుడు వికాస్ లైసెన్స్ డ్ గ‌న్ తో అత‌డిని కాల్పి చంపారు.. శుక్రవారం తెల్లవారు జామున 4.15 గంటలకు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లోని బెగారియా గ్రామంలో మంత్రి ఇంట్లో ఈ ఘటన జరిగింది. మంత్రి కుమారుడి స్నేహితుడు ఒకరు పార్టీ కోసం అని వినయ్ శ్రీవాస్త‌వ్ ను పిలిచారు. అయితే పార్టీ జరుగుతుండగా మధ్యలో శ్రీవాస్తవను తలలో కాల్చి చంపారు. మృతుడిని 30 ఏళ్ల వినయ్ శ్రీవాస్తవ్ గా గుర్తించారు. చనిపోయిన యువకుడిని కౌషల్ కిషోర్ తనయుడు అషూ అలియాస్ వికాస్ స్నేహితుడిగా గుర్తించారు. అంతేకాదు వినయ్ బీజేపీ కార్యకర్త కూడా.

అయితే చంపడానికి ఉపయోగించిన గన్ మంత్రి కుమారుడు అషు లైసెన్స్డ్ రివాల్వర్ గా తేల్చారు పోలీసులు. అయితే హత్య జరిగిన సమయంలో మంత్రి తన ఇంట్లోనే ఉన్నారు. వెంటనే ఆయన పోలీసులకు ఈ సమాచారాన్ని అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గన్ ను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. యువకుడి శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు లక్నో డీసీపీ (వెస్ట్) రాహుల్ రాజ్ తెలిపారు. మరణించిన యువకుడి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల పై ఐపీసీ సెక్షన్ 302(హత్య) కింద కేసు నమోదు చేశారు.

దీనికి సంబంధించిన ముగ్గురును అదుపులోకి తీసుకున్నట్లు లక్నో డీసీపీ (వెస్ట్) రాహుల్ రాజ్ తెలిపారు.ఇక ఈ విషయం గురించి బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, నిందితులను వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు. ఈ ఘటన జరిగినప్పుడు తాను ఇంట్లోనే ఉన్నానని, అయితే ఆ సమయంలో తన ఇంట్లో ఎవరు ఉన్నారన్న విషయం తెలియదని పేర్కొ్న్నారు. తన కుమారుడు వికాస్ కూడా ఆ సమయంలో ఇంట్లో లేడని, అతడి భార్య ఢిల్లీలో ఉంటుందని, ఆమె ఆరోగ్యం పాడైతే ఆసుపత్రిలో చేరిందని తెలిపారు మంత్రి. ఘటన జరగడానికి ముందు రోజే వికాస్ తన భార్య దగ్గరకు ఢిల్లీ వెళ్లాడని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement