Sunday, April 28, 2024

Free Ration – ఎన్నిక‌ల వేళ‌… ఉచిత రేష‌న్ ప‌థ‌కం మ‌రో అయిదేళ్లు పొడిగించిన మోడీ

దుర్గ్ – ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ప్రధాని ప్రకటించారు. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందించే పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం పొడిగించాలని నిర్ణయించుకున్నట్లు మోడీ తెలిపారు. మోసం తప్ప పేదలకు కాంగ్రెస్ ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదని మోడీ అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ పేదలను గౌరవించ లేదన్నారు. పేదల బాధలు వారికి ఎప్పుడూ అర్థం కావన్నాడు. అందుకే కాంగ్రెస్.. అధికారంలో ఉన్నంత కాలం పేదల హక్కులను దోచుకుని తిని నాయకులంతా తమ ఖజానాను నింపుకున్నారంటూ మండి పడ్డారు. 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. పేదరికాన్ని నిర్మూలించగలమని విశ్వాసం కలిగించామన్నారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని మోడీ అన్నారు. పేదరికం నుంచి బయటపడిన వారే నేడు మోదీకి కోట్లాది దీవెనలు ఇస్తున్నారని తెలిపారు. ప్రతి పేదవాడు తన పేదరికాన్ని అంతమొందించే అతిపెద్ద సైనికుడిగా మారి మోడీకి తోడుగా ఉండేలా కొత్త విధానాలను రూపొందించామన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎంతో ఓర్పు, నిజాయితీతో పని చేసింది. మోడీకి ప్రజా సేవకుడు.. మీ అందరికీ సోదరుడు.. అతనో పేదవాడని అభివర్ణించుకున్నాడు. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా పేదలకు ఉచిత రేషన్ అందేలా బీజేపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ప్రధాని అన్నారు. అందుకే వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్ సౌకర్యం కల్పించామన్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం దేశంలోని 80 కోట్ల మంది కోవిడ్ సమయంలో పేద ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చామ‌ని, 28 నెలల్లో ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ కోసం రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement