Thursday, April 25, 2024

ఆరోగ్య స‌మ‌స్య‌ల‌వ‌ల్లే రాజ‌కీయాల‌కి దూర‌మ‌య్యా.. ర‌జ‌నీకాంత్

ఆరోగ్య స‌మ‌స్య‌ల‌వ‌ల్లే తాను రాజ‌కీయాల‌కి దూరంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి రజనీకాంత్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. తాను మూత్రపిండాల సమస్యతో బాధపడుతుండడం వల్లే రాజకీయాలకు దూరమైనట్టు చెప్పారు. తాను ఆ సమస్యకు చికిత్స పొందుతున్న సమయంలో రాజకీయాల్లోకి రావాలని అనుకున్నానని చెప్పారు. అయితే, రాజకీయాల్లోకి వస్తే ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుందన్నారు.

ఎక్కువ కార్యక్రమాలతో బిజీగా ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదని అప్పట్లో డాక్టర్ రాజన్ రవిచంద్రన్ తనకు సలహా ఇచ్చారని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు.తాను కరోనా సమయంలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా చాలామంది ఇలాంటి సలహానే ఇచ్చినట్టు చెప్పారు. అప్పట్లో తాను బహిరంగ సభల్లో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందుకనే రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. తాను ఈ విషయాలు చెబితే తాను భయపడుతున్నానని అనుకుంటారని, అందుకనే ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదన్నారు. దేవుడు ఉన్నాడని చెప్పిన రజనీకాంత్.. లేడు అనే వారు కనీసం ఒక్క రక్తపు బొట్టునైనా తయారు చేసి చూపించాలని సవాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement