Saturday, May 11, 2024

Delhi | కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి అప్రమత్తంగా ఉండండి – రాష్ట్రాలకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో కోవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 రకం కేసులు గుర్తించడంతో పాటు కేరళలో మరణాలు సైతం నమోదవడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాస్తూ.. కోవిడ్-19 కొత్త కేసులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, శ్వాసకోశ పరిశుభ్రతను పాటించడం ద్వారా వ్యాధి వ్యాప్తి పెరిగే ప్రమాదాన్ని తగ్గించడానికి అవసరమైన ప్రజారోగ్య చర్యలు చేపట్టాలని కోరారు.

గతంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్-19 మార్గదర్శకాలను అమలు చేయాలని, జిల్లాలవారిగా ఫ్లూ జ్వరాలు, శ్వాసకోస అనారోగ్య సమస్యలపై దృష్టిసారించాలని లేఖలో పేర్కొన్నారు. ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని, అలాగే వ్యాధికారక వైరస్ రకం ఏంటో తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా జరపాలని సూచించారు. కోవిడ్-19 కొత్త వేరియంట్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల్లో వైద్యారోగ్య మౌలిక వసతులు, సామర్థ్యాన్ని పరీక్షించుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే మాక్ డ్రిల్స్‌లో పాల్గొనాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ ఆరోగ్య సౌకర్యాల క్రియాశీల భాగస్వామ్యం కూడా ఉండేలా చూడాలని కోరారు. అలాగే ప్రజల్లో అవగాహన, అప్రమత్త పెంచేలా జాగ్రత్తలు, సూచనలు ఎప్పటికప్పుడు జారీ చేయాలని కూడా లేఖలో పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement