Friday, May 17, 2024

కెన‌డా ర‌క్ష‌ణ‌శాఖ మంత్రిగా..భారత సంతతికి చెందిన అనితా ఆనంద్..

భార‌తీయులు ప్ర‌పంచ దేశాల్లో త‌మ స‌త్తాని చాటుతున్నారు..ఆ దేశంలోని ప‌లు కీల‌క ప‌ద‌వుల్లో వారు భాగ‌స్వామ్యం అవుతుండ‌టం గ‌ర్వించ‌ద‌గ్గ అంశం. ఇప్ప‌టికే ఎంతోమంది భార‌తీయులు ఈ ఘ‌న‌త‌ని ద‌క్కించుకోగా..మ‌రో భార‌త సంత‌తికి చెందిన మ‌హిళ‌కి ఓ కీల‌క ప‌ద‌వి ద‌క్కింది. కెన‌డా క్యాబినెట్ లో భార‌త సంత‌తికి చెందిన మ‌హిళ కీల‌క ప‌ద‌విని ద‌క్కించుకోవ‌డం విశేషం. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో.. క్యాబినెట్‌ను పునర్ వ్యవస్థీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్యాబినెట్‌లో భారత సంతతికి చెందిన మహిళకు కీలక పదవిని ఇచ్చారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఎంతో కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా భారత సంతతి మహిళ అనితా ఆనంద్‌ను నియమించారు కెన‌డా ప్ర‌ధాన‌మంత్రి. న్యాయవాది, రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందిన 54 ఏళ్ల అనితా ఆనంద్.. కెనడాలోని ఓక్ విల్లే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జస్టిన్ ట్రూడో నాయకత్వంలోని లిబరల్ పార్టీ నుంచి 46శాతం ఓట్లతో ఆమె విజయం సాధించారు. కార్పొరేట్ లాయర్‌గా ప్రస్థానం ఆరంభించిన అనిత రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజా సేవల మంత్రిగా, వ్యాక్సిన్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనితా ఆనంద్.. దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించడంలో సమర్థంగా వ్యవహరించారన్న గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతోపాటు కార్పొరేట్‌ గవర్నెన్స్‌ రంగంలో ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉంది.

కాగా ఇప్పటివరకు కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతికే చెందిన హర్జీత్ సజ్జన్ కొనసాగుతూ వచ్చారు. అయితే, ఆయనపై సైన్యంలో లైంగిక వేధింపుల అంశానికి సంబంధించిన దర్యాప్తులో విమర్శలు వెల్లు వెత్తాయి. దీంతో ఆయనను రక్షణ శాఖ నుంచి తప్పించి ఆ బాధ్యతలను అనితా ఆనంద్‌కు అప్పగిస్తూ ట్రూడో నిర్ణయం తీసుకున్నారు. అయితే.. సజ్జన్‌ను అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రిగా నియమించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement