Saturday, May 4, 2024

అసెంబ్లీ నీ అబ్బ‌సొత్తు కాదు.. బ‌రాబ‌ర్ మేము అసెంబ్లీలో అడుగుపెడ‌తాం : ఎంపీ ర‌విచంద్ర‌

సత్తుపల్లి : బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి పై రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గెట్ నీ అబ్బ సొత్తు కాదు.. బరాబర్ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెడతారు అంటూ సవాల్ చేశారు. నీకో రాజకీయ జెండా లేదు.. ఎజెండా లేదు.. అమాయకులైన నలుగురు నాయకులను వెంటేసుకుని తిరుగుతున్నావు.. వాళ్లను రాజకీయంగా అన్యాయం చేయడం తప్ప ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన అవకాశాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేసుకున్నావు.. కానీ అదే క్రమంలో ఆర్ధికంగా లాభపడ్డావు అంటూ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ లు ఇచ్చిన వారిని ఓడించడానికి కుయుక్తులు పన్నావు.. అయినా కేసీఆర్ ఓపికతో ఎదురు చూశారు.. కానీ నీలో మార్పు రాలేదు అంటూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై మండి పడ్డారు. కేసీఆర్ ఇటుక, ఇటుక పేర్చి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని శక్తి వంతంగా చేశారు. ఈ పార్టీని ఓడించడం ఎవరి తరం కాదని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement