Saturday, July 27, 2024

భార‌త్ పై ఆగ్ర‌హం, 16 దేశాల్లో నిరసన ప్రదర్శనలు.. ఇండియా ఉత్పత్తులపై నిషేధం..

మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్‌శర్మ చేసిన వ్యాఖ్యలు భారత్‌కు అరబ్‌, ఇస్లాందేశాలతో ఉన్న దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. బీజేపీ నేతలు నుపుర్‌ శర్మ, నవీన్‌కుమార్‌ జిందాల్‌లను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం, అవి వారి వ్యక్తిగత వ్యాఖ్యలని భారత ప్రభుత్వం ప్రకటించినా, పలు దేశాల్లో మాత్రం ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 16దేశాలు ఇరాక్‌, ఇరాన్‌, కువైట్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, ఒమన్‌, అరబ్‌ ఎమిరేట్స్‌, జోర్డాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌, బహ్రెయిన్‌, మాల్దివులు, లిబియా, టర్కీ, ఇండోనేషియాలు వివాదాస్పదవ్యాఖ్యలకు నిరసనగా ఇండియాపై అధికారికంగా వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించాయి. మహ్మద్‌ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు గాను భారతప్రభుత్వం క్షమాపణ కోరాలని డిమాండ్‌ చేస్తున్నాయి. నుపురుశర్మ, నవీన్‌ జిందాల్‌ వ్యాఖ్యలపై ఇండియాలో కూడా వ్యతిరేకత ఎదురవుతోంది. ఆ ఇద్దరు బీజేపీ నేతలపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను దిగజార్చడానికి బీజేపీనే కారణమని ఆరోపించాయి. బీజేపీ నేతల వ్యాఖ్యలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదురవుతున్న వ్యతిరేక, నిరసన ప్రదర్శనలను, ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఆ వ్యాఖ్యలు కేవలం వారి వ్యక్తిగత అభిప్రాయాలు తప్ప, ఆ వ్యాఖ్యలు,అభిప్రాయాలతో భారత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఒక ప్రకటనలో వెల్లడించింది. పార్టీ నుంచి ఆ ఇద్దరు నేతలను సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తుందని స్పష్టం చేసింది. ఇతర మతాలను కించపరిచి, ద్వేషించే వారికి పార్టీలో స్థానంలేదని స్పష్టం చేసింది. బీజేపీ నేతల వ్యాఖ్యలను ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ (ఓఐసీ)ఖండించింది. ఇండియాలో మైనార్టీల హక్కులను కాపాడేందుకు ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకోవాలని సూచించింది. ఖతార్‌, ఇరాన్‌, కువైట్‌లు ఆయా దేశాల్లోని భారత్‌ అంబాసిడర్లను పిలిచి ఆ కామెంట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆదేశాల్లో ని భారత రాయబార కార్యాలయాలు ప్రత్యేక ప్రకటనలు చేశాయి. ఆ వ్యాఖ్యలు భారత ప్ర భుత్వానివి కాదని, వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది వ్యక్తులని, వాటి ప్రభావం ఇండియా గవర్నమెంటుపై ఉండదని ప్రకటించాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలతో ఇండియా ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేయాలని సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ జరిగింది. పలు దేశాల్లో భారత్‌ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. పదిరోజుల క్రితం దేశవ్యాప్తం గా జరిగిన మతవిద్వేష సంఘటనలనే అంశంపై టీవీ డిబేట్‌లో పాల్గొన్న నుపుర్‌ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మీడియా చీఫ్‌ నవీన్‌ జిందాల్‌ ప్రవక్తపై ట్విట్టర్‌లో అనుచిత పోస్ట్‌ చేసి డిలీట్‌ చేశారు. నుపుర్‌శర్మ సైతం ట్విట్టర్‌లో క్షమాపణ తెలిపారు. ఏ మతాన్నీ, మతస్తుల సెంటిమెంట్లను దెబ్బతీయడం తన అభిమతం కాదని పేర్కొన్నారు. ఢిల్లి పోలీసులు నుపుల్‌శర్మ, ఆమె కుటుంబసభ్యులకూ రక్షణ కల్పించారు.

అరెస్టు చేయాలి..

నుపుర్‌శర్మను అరెస్ట్‌ చేయాలని ఎంఐఎం అధ్యక్షు డు అసదుద్దీన్‌ ఓవై సీ డిమాండ్‌ చేశారు. ఆమెను అరెస్ట్‌ చేయకుండా పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించా రు. గల్ఫ్‌ దేశాలు భారత్‌పై ఒత్తిడిని పెంచిన తర్వాతనే, బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిందని ఓవైసీ ఆరోపించారు.

ఇండియా క్షమాపణ అవసరం లేదు..

నెదర్లాండ్స్‌ ఎంపీ…
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి చేసిన మహ్మద్‌ వ్యాఖ్యలపై అంతర్జా తీయంగా వ్యతిరేకత ఎదురవుతు న్న సమయంలో డచ్‌ ప్రజాప్రతినిధి భారత్‌కు అండగా నిలబడ్డారు. నెదర్లాండ్స్‌ లోని ఫ్రీడమ్‌ పార్టీకి చెందిన ఎంపీ గీర్ట్‌ విల్డర్స్‌ మాజీ బీజేపీ నేతలకు. ఇండియా అండగా నిలబడ్డారు. నుపుర్‌శర్మ చేసిన వ్యాఖ్యల్లో వాస్త వం ఉందని, ఇండియా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమిటని ఆయన ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఇస్లాం దేశాల ఒత్తిడికి తలవంచవద్దని, బుజ్జగింపులు ఎప్పుడూ పనికి రావని, భారతీయులు నుపుర్‌శర్మకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement