Friday, April 26, 2024

ఏపీ అసెంబ్లీ అరాచకానికి నిలయం.. సీఎం, స్పీకర్ క్షమాపణ చెప్పాలి : సీపీఐ నారాయణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అరాచకానికి నిలయంగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సోమవారం ఆయన న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడమేంటి? వారు మనుషులా? పశువులా? అని ప్రశ్నించారు. బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేత పట్ల ఇలా వ్యవహరించడం తగదని నారాయణ హితవు పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి నిరాశ నిస్పృహల్లో ఉందని, నిరక్షరాస్యులకు ఓటు హక్కు కల్పించి మరీ దొంగ ఓట్లు వేయించుకున్నా సరే ఓడిపోవడంతో అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 

గతంలో అసెంబ్లీలో తోపులాట జరిగిందే తప్ప, ఇలాంటి దాడులు చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో స్పీకర్, సీఎం ఇద్దరిదీ తప్పు ఉందన్న ఆయన, వారిద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను శాశ్వతంగా  సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారం, సీఎం పదవి శాశ్వతం కాదని, రేపు నువ్వు అటు వైపు ఉంటావని నారాయణ జోస్యం చెప్పారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవడం మాని బాధితులను సస్పెండ్ చేయడం తగదని హితవు పలికారు.  ఎమ్మెల్యేపై దాడి ఘటన ప్రజాస్వామ్యంలో చీకటి రోజని నారాయణ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement