Sunday, April 28, 2024

Murder Case | ఆ అయిదుగురూ దోషులే.. జర్నలిస్టు సౌమ్య మర్డర్​ కేసులో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు

దేశ రాజధానిలో 15 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన ప్రముఖ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్‌ హత్య కేసులో ఢిల్లి కోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితుల్ని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. నలుగురు నిందితులు రవి కపూర్‌, అమిత్‌ శుక్లా, బల్జిత్‌ మల్లిక్‌, అక్షయ్‌ కుమార్‌ను హత్య, దోపిడీ అభియోగాల కింద దోషులుగా నిర్ధారించగా, వారికి సాయం చేసిన అభియోగాలపై అజయ్‌ సేఠిని దోషిగా ప్రకటించింది. వీరికి త్వరలోనే శిక్ష ఖరారు చేయనుంది. ఓ టీవీ ఛానల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్న సౌమ్య విశ్వనాథన్‌ పదిహేనేళ్ల క్రితం దారుణ హత్యకు గురయ్యారు.

2008 సెప్టెంబరు 30వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆమె ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుండగా.. వసంత్‌ విహార్‌ ప్రాంతంలో ఆమె కారును నిందితులు అడ్డగించి దోపిడీకి యత్నించారు. అనంతరం ఆమెపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఉదయానికి కారులో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. తొలుత ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు.

అయితే పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఆమె తలకు బుల్లెట్‌ గాయమైనట్లు తేలడంతో హత్యగా నిర్ధారించారు. అనంతరం సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. ఆమె కారును మరో వాహనం అనుసరించినట్లు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు 2009లో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. దోపిడీ కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement