Friday, April 26, 2024

జగన్ మెంటల్ మామ కాదు.. చందమామ: వైసీపీ ఎమ్మెల్యే రోజా

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలన్న టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా కౌంటర్ ఇచ్చారు. తిన్నది అరగక చంద్రబాబు, లోకేష్ విమర్శలు చేస్తున్నారని, ఏం మాట్లాడడానికి విషయాలు లేక, ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. వీళ్లకు అసలు రాష్ట్రంపై ఏమైనా బాధ్యత ఉందా? అని ప్రశ్నించారు. లోకేష్ తనలాగే రాష్ట్రంలోని విద్యార్థులు కూడా చదువులో మొద్దుల్లాగా వెనుకబడిపోవాలని కోరుకుంటున్నారని విమర్శించారు. ఆయన పోరాటం చూస్తే అందుకేనేమో అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పరీక్షలు జరుపుతామనో, జరపబోమనో సీఎం జగన్ ఇప్పటికీ కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని.. లోకేష్ ఈ విషయం గుర్తించాలని రోజా హితవు పలికారు.

పిల్లల భవిష్యత్ బాగుండేలా టెన్త్, ఇంటర్ పరీక్షలు జరపడానికి అనువైన సమయం కోసం సీఎం జగన్ చూస్తున్నారని వివరించారు. ఏపీలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు ఆరు శాతానికి వచ్చిందని, పూర్తిగా తగ్గిపోయిన తర్వాత పరీక్షలు జరిపితే వారికి నాణ్యమైన విద్యను అందించిన వారమవుతామని రోజా పేర్కొన్నారు. పరీక్షలు లేకపోతే లోకేష్ వంటి మొద్దు పిల్లలు సంతోషపడతారేమో కానీ, బాగా చదివే పిల్లలు పరీక్షలు లేకపోతే ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ఇంటర్ చదువే ప్రాతిపదిక అని, ఈ నేపథ్యంలో పరీక్షలు రద్దు చేస్తే విద్యార్థుల్లో ఉదాసీన వైఖరి ఏర్పడుతుందని రోజా అభిప్రాయపడ్డారు. జగన్‌పై మెంటల్ మామ అని విమర్శలు చేస్తుండడంపైనా రోజా చిరునవ్వుతో స్పందించారు. జగన్ మెంటల్ మామో, చందమామో ప్రజలందరికీ తెలుసని, చందమామ వంటి జగన్‌ను విద్యార్థులు ఎంతో ఆప్యాయంగా మామ అంటారని వివరించారు. ఆ మెంటల్ అనేది చంద్రబాబు, లోకేష్‌లకు వర్తిస్తుందని విమర్శలను తిప్పికొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement