Sunday, May 5, 2024

రామేశ్వర జ్యోతిర్లింగము

శ్లో॥ సంతామ్రపర్ణీ జలరాశి యోగే
నిబద్ధసేతుం విశిభైరసంభ్యైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తమ్
రామేశ్వరాఖ్యం నియతం నమామి ॥

భావము: ఏ నదిలో నీటి బిందువులు ముత్యపు చిప్పలో పడగానే ముత్యములుగా మారుతాయో, తనలో స్నానము చేసిన పాపాత్మునికి ముక్తిని ప్రసాదిస్తుందో ఆ తామ్ర పర్జీనది సముద్రములో కలిసే చోట, అనేక బాణములతో వారధి (సేతువు)ను నిర్మించిన శ్రీరామచంద్రునిచే ప్రతిష్ఠింపబడి, రామేశ్వరుడని పిలువబడుచున్న పరమేశ్వరునికి నిత్యము నమస్కరించుచున్నాను.

పురాణగాథ:
శ్రీరాముడు రావణ వధానంతరము లంక నుండి పుష్పక విమానంలో తిరిగి వస్తూ ‘పులస్త్య బ్రహ్మ వంశమున పుట్టిన రావణ, కుంభ, కర్ణాది రాక్షసులను సంహరించుట వలన బ్రహ్మ హత్యాపాతకము కలుగును. కావున తగిన పరిహార ‘మేదైనా చేసుకోవాలి’ అని తలచి ప్రస్తుత రామేశ్వర ప్రాంతమున నున్న అగస్త్యముని ఆశ్రమమును చేరాడు. అగస్త్యుడు శ్రీరామునకతిథి సత్కారములు చేసి, బ్రహ్మ హత్యా దోష నివారణకై సముద్ర తీరమున ఒక శివలింగమును ప్రతిష్ఠ చేయమన్నాడు. శ్రీరాముడు హనుమంతుని పిలిచి, కైలాసము నుండి శివలింగమును తెమ్మని పురమాయించాడు. సీతమ్మకు అగ్నిపరీక్ష జరిగిందిక్కడనే. విభీషణాదులు లంక వరకు కట్టబడిన సేతువు (బ్రిడ్జి) ఇంకనూ ఉండుట మంచిది కాదనియు, దానిని ధ్వంసము – చేసిన బాగుండుననియు చెప్పారు. అపుడు శ్రీరాముడు తన ధనస్సు యొక్క చివరతో ఆ సేతువును భగ్నము చేశాడు. అట్టా సేతువు శ్రీరాముని ధనస్సు చివరతో భగ్నమైంది (విరిగింది కాబట్టి ఆ ప్రాంతానికి ధనుష్కోటి అని పేరు వచ్చింది. ఇక్కడి గంధమాదన పర్వతము అతి పుణ్యస్థలము. హనుమంతుడు శివలింగమునకై కైలాసానికి వెళ్ళిన వాడింకను తిరిగి రాలేదు.. శివలింగ ప్రతిష్ఠకు నిర్ణయించిన సమయము దగ్గర గుచున్నది. అందరిలోను ఆత్రుత పెరుగుతోంది. సమయం (శుభముహూర్త సమయం) మించిపోకుండా సైకత (ఇసుకతో చేసిన శివలింగమును ప్రతిష్ఠించుట మంచిదని నిర్ణయించారు.. సీతాదేవి సముద్రమునందలి తడి ఇసుకతో ప్రార్థివ శివలింగమును తయారు చేసింది. నిర్ణీత సమయమున విధి విధానముగా శ్రీరాముడా సైకత లింగమును ప్రతిష్ఠించాడు. రామునిచే ప్రతిష్ఠింపబడిన ఆ లింగమును రామేశ్వరుడని, రామేశ్వర తె లింగమనీ వ్యవహరిస్తారు. ఆ లింగ ప్రతిష్ఠ పూర్తయిన క్షణమున హనుమంతుడు కైలాసము నుండి శివ లింగమును తెచ్చాడు. తాను తెచ్చిన లింగమును కాక వేరొక లింగమును ప్రతిష్టించినందుకు ఆంజనేయుడలిగాడు. అతని అలక తీర్చు నెపముతో తాను మహాబలవంతుడననే గర్వమును భగ్నపరచు ఉద్దేశముతో శ్రీరాముడు. శ్రీ హనుమంతుని ఓదారుస్తూ తాను ప్రతిష్టించిన సైకత లింగము నక్కడ నుండి తొలగించిన హనుమంతుడు తెచ్చిన లింగమునక్కడ ప్రతిష్ఠిస్తానని చెప్పాడు. ఆ సైకత లింగమునక్కడ నుండి తొలగించుటకు విశ్వప్రయత్నము చేసియు, ఫలించక మూర్ఛ పోయాడు. సీతమ్మ అతనిని మూర్ఛ నుండి సేదదీర్చి ప్రశాంతుడిని చేసింది. అపుడు శ్రీరాముడు “హనుమా! అది (ఆ సైకత లింగము) పవిత్రురాలైన మీ అమ్మ సీతమ్మ చే చేయబడింది. విధి విధానంగా, శాస్త్రోక్తంగా నా చేత ప్రతిష్ఠింపబడింది. దానిని నెవరును వీసమంతైనను కదలించలేరు నీవు చింతించకు – నీవు తెచ్చిన లింగమును కూడ యిక్కడ ‘హనుమదీశ్వరుడు’ అను పేరుతో ప్రతిష్ఠించుదము. ఇక్కడకు వచ్చిన భక్తులు “నీవు తెచ్చిన లింగమును దర్శించనిదే రామేశ్వర దర్శన పుణ్యఫలము అను వరముతో అతనిని ఓదార్చి ఆ లింగమును రామేశ్వర లింగమునకు దగ్గరలోనే ప్రతిష్ఠించాడు. దీనికి హనుమదీశ్వరుడని, కాశీవిశ్వనాథుడనీ పేర్లు కలిగాయి.

ఈ రామేశ్వర క్షేత్రమును గూర్చి స్కాంద పురాణము యెంతగానో వర్ణించింది. రామేశ్వర స్వామి దేవాలయము 1000 అడుగుల పొడవు, 650 అడుగుల వెడల్పు, 150 అడుగుల యెత్తుతో అనంతమైన శిల్పకళతో నిర్మింపబడింది. ఈ క్షేత్రంలో నందీశ్వరుడు, వెండి రథము, బంగారు గోపురాలు చూడదగినవి. ఆలయం చుట్టూ 1200 స్తంభాలతో ప్రదక్షిణ మండపం నిర్మింపబడింది. ప్రతి స్తంభము ఒకే రాతితో మలచబడింది. ఆలయ ప్రహరీకి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలున్నాయి. ప్రహరీ బయట స్తంభములుగా తీర్చుట కోసమన్నట్లు మండపములోని స్తంభముల సైజులో (పొ-వె- మందము) పలకలుగా తీర్చిన ఏకశిలలు యెన్నో పడి వున్నాయి. ఇంకా ఏమి నిర్మించదల పెట్టారో ఆనాడు – ఆలయము లోపల 23 నూతులు (తీర్ధములు) న్నాయి. సముద్రము అగ్ని తీర్ధముగా 24వ తీర్థముగా చెప్పబడుతోంది. ఉత్తర భారత యాత్రీకులు తాము తెచ్చిన గంగా జలముతో రామేశ్వర లింగాన్ని అభిషేకిస్తారు. ఇక్కడి సముద్రపుటిసుకను తీసుకు వెళ్ళి గంగానదిలో కలుపుతారు. ఈ పుణ్య కార్యము త్రేతాయుగము నుండి నేటి వరకూ కొనసాగుతూనే వుంది.

చరిత్ర: ఈ రామేశ్వరం గూర్చి చారిత్రకంగా చెప్పుకోదగిన విశేషాలు లేవు. మధ్య, ఉత్తర భారతదేశంలో వున్నంత తీవ్రముగా ఈ ప్రాంతంలో ముస్లిం దండయాత్రలు లేవు. అదుచేత ఇక్క‌డ సాహితీ సంస్కృతులు , క‌ళ‌లు, దేవాల‌య శిల్ప సంప‌ద నేటికీ చెక్కు చెద‌ర‌క నిలచి ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement