Sunday, May 19, 2024

అనన్యం…జగన్మాత మహిమ

వ రగర్వముతో అసురులు పశుప్రాయులైనపుడు వారిని అంతం చేయడానికి త్రిమూర్తుల శక్తి కూడా సరిపోలేదు. భక్తితో తపమాచ రించిన వారెవరైనా వారికి వరములు ఇచ్చుట దైవధర్మము. కానీ వారే సృష్టికి విరుద్ధముగా మారి లోక కంటకులైతే వరమిచ్చిన వారే వధించుట విశ్వధర్మము. చెడుపై మంచి విజయం సాధించి తీరుతుంది. అయితే దానికి అపారమైన శక్తి అవసరం. అటువంటి శక్తి స్వరూపిణి అయిన జగన్మాత దుర్గాదేవిని త్రిమూర్తులతో కలసి సకల దేవగణాలు సృజించిన సంఘటన అద్భుతం.
బ్రహ్మతేజము ననుసరించి శివవిష్ణు దివ్యశక్తి ప్రభలు
సకలదేవగణాలు సర్వాయుధ సంపత్తిని ప్రోదిసేయ
తిమిరమును తొలగించ త్రిశూలధారియైనవతరించి
అసురులను అంతమొందించె దుర్గమ్మ మహాకాళియై!

” యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా” సకల జీవులలోను చైతన్య శక్తిగానుండి రక్షిస్తోంది జగన్మాత దుర్గ. మహాలక్ష్మి, భగవతి, శివాని, శాంతి, కళ్యాణి, రుద్రాణి, పుష్టి, కాళరాత్రి, ఇంద్రాణి, సిద్ధి, బుద్ధి, వైష్ణవి, అంబ, జగ దంబ, పరమేశ్వరి, ఈశ్వరి, లలిత, దాక్షాయణి, నవదుర్గ మొదలగు రూప నామాలతో దుష్టశిక్షణ శిష్టరక్షణ చేస్తూ వస్తున్నది జగన్మాత దుర్గ.
ఆశ్వీయుజ నవరాత్రి వ్రతమును అనుష్ఠానము చేసి బ్రహ్మ, విష్ణు, మహే శ్వరుడు, ఇంద్రుడు, శ్రీరామచంద్రుడు, విశ్వామిత్రుడు, భృగువు, వసిష్ఠుడు, కశ్యపుడు, ధర్మరాజు, అర్జునుడు మొదలగువారు విజయాన్ని పొందారు.
సీతాపహరణ తరువాత చింతాక్రాంతులై ఉన్న రామ -లక్ష్మణుల వద్దకు నారదమహర్షి విచ్చేసి దేవీ మహిమను విశదీకరించాడు. దేవి ఆద్యాశక్తి ఆ జనని కృపాకటాక్షాల వలన సకల కోరికలు తీరతాయి. దు:ఖం దూరమవుతుంది. దేవశక్తి లేని ప్రదేశం ఈ విశ్వంలో లేదు. త్రిమూర్తులతో ప్రకాశించు తేజము ఈ దేవి. అనేక రూపనామాలతో సత్తాత్మక రూపమై విరాజిల్లుతోంది. ప్రకృతిలోని శక్తి ఈ దేవి. ఈ శక్తి నుండియే పురుషుడు ప్రకటమగుచున్నాడు. దేవిని గురించిన జ్ఞానమును లభ్యము చేసుకున్న మానవులు జనన మరణ సంసార చక్రము నుండి విముక్తి పొందుతారు. వేదమాత ఈ శక్తిరూపిణి. అటువంటి జగన్మాతను తొమ్మి ది రాత్రులు ఆరాధించమని నారద మహర్షి శ్రీరాముడికి చెప్పాడు ఇలా-
”జగన్మాత ఉపాసన తో ఆరాధించి ప్రసప్నురాలిని చేసుకొన్నచో ఆ రావణుని వధించి సీతాదేవిని పొందుట తథ్యము.” అని నారద మహర్షి దేవీ నవరాత్రి వ్రత విధానాన్ని తెలియచేసాడు.
కిష్కింధ పర్వతమున శ్రీరామచంద్రుడు ఉపవాస దీక్షతో హోమము నిర్వ హించాడు. అష్టమినాటి అర్ధరాత్రి దేవి ప్రత్యక్షమయింది.
శ్రీరామునితో ఈ విధంగా పలికింది.

”ప్రార్థయస్వ వరం కామం యత్తే మనసీవర్తతే
నారాయనాంశసంభూతస్త్వం శంశో మనవేనధే!”

”రావణ సంహారమునకు దేవతలు ప్రార్థించగా, నీవు భగవంతుడగు నారా యణుని అంశ వలన అవతరించితివి. మనువు యొక్క పవిత్ర వంశము నీది. నీ నవరాత్రి వ్రత దీక్షకు నేను సంతుష్టురాలైనాను. నీ దీక్షను శ్రద్ధతో కొనసాగించి పూర్తి చెయ్యి. నీ కోరిక నెరవేరుటకు నా శక్తిని నీకు, శేషనాగుని అవతారమైన నీ తమ్ముడు లక్ష్మణునకు, సమస్త వానరపైన్యానికి ప్రసాదిస్తున్నాను. రావణుని వధించి ధర్మసంస్థాపన చేసి పదకొండు వేల సంవత్సరములు ఈ ధరాతలమును పరిపాలించి మార్గనిర్దేశన చెయ్యమని చెప్పి అంతర్థానమయింది. నవరాత్రి వ్రతమును పూర్తి చేసి దశమినాడు యుద్ధయాత్రకు బయలుదేరి విజయాన్ని పొందాడు శ్రీరామచంద్రుడు.
పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం పూర్తి చేసుకొని అజ్ఞాత వాసం కొరకు విరాటరాజు కొలువు చేరారు. నగర ప్రవేశానికి ముందు తమ ఆయుధాలను నకులునితో ఒక శమీవృక్షం మీద భద్రపరచి, ధర్మరాజు ‘త్రిభువనే శ్వరి’ అయిన దుర్గామాతను ఇలా స్తుతించాడు.
”జయాత్వం విజయాచైవ సంగ్రామేచ జయప్రదా|
మమాపి విజయం దేహి వరదాత్వంచసామ్ప్రతమ్‌||”

”అమ్మా దుర్గాదేవీ! జయ, విజయ అనునామాలు నీకు కలిగి ఉన్నాయి. సం గ్రామాలలో నీకు విజయం అనివార్యము. కావున ధర్మమార్గములోనున్న మాకూ విజయాన్ని కలుగజేయు వరమును ఇమ్ము” అని ప్రార్థించాడు. దుర్గా దేవి పాండవులను కటాక్షించింది. ”శ్రీకృష్ణుని శక్తితో మీకు విజయం తథ్యమ”ని దీవించింది.
కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. భీష్ముడు రచిస్తున్న అభేద్యమైన వ్యూహాలను చూసి ధర్మరాజు ఆందోళనపడ్డాడు. తన భయాన్ని అర్జునునకు వ్యక్తపరచాడు. అంత అర్జునుడు శ్రీ కృష్ణుని ఆశ్రయిస్తాడు. అప్పడు శ్రీకృష్ణ భగవానుడు విజయం ప్రాప్తించాలంటే శక్తిని అందుకోవడం తప్పనిసరి అని దుర్గాదేవిని స్తుతించమని సూచించాడు. భగవానుని సలహా మేరకు అర్జునుడు అమ్మలకే అమ్మ… ముగ్గుర మ్మలకు మూలపుటమ్మ అయిన దుర్గామాతను ఇలా స్తుతించాడు.
”కాత్యాయని మహాభాగే కరాలి విజయేవిజయే|
శిఖిపించధ్వజ ధరేనానాశరన భూషితే||”

- Advertisement -

”జయ, విజయ అను నామములతో కాత్యాయినిగా, భయంకర రూప ధారిణియగు కాళికా, నెమలి పింఛమును ధ్వజముగా చేసుకొని వివిధ తేజో మయమయిన ఆభరణములతో ప్రకాశిస్తున్న ఓ జగజ్జననీ! మాకు విజయాన్ని ప్రసాదించుము” అని అర్జునుడు జగజ్జగాలకు అమ్మ అయిన దుర్గమ్మ తల్లి కరుణకై దుర్గాస్తవనము చేస్తాడు. ఆ తరువాత యుద్ధానికి సిద్ధపడ్డాడు. శ్రీకృష్ణ భగవానుని ధర్మ సంస్థాప ధ్యేయానికి కర్మాను ష్టానుడైనాడు. తుదకు విజ యుడై నిలిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement