Wednesday, May 1, 2024

AP: రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే లక్ష్యం.. సీఎం జగన్

రాష్ట్రాన్ని క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నదే లక్ష్యమని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ఇవాళ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ముందుగా దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం జెండా ఊపి ఆటోల‌ను ప్రారంభించారు. ఆటోల నిర్వాహ‌ణ‌పై డ్రైవ‌ర్ల‌ను, అధికారుల‌ను అడిగి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రాలు తెలుసుకున్నారు. రూ.4.10 లక్షల విలువైన 516 ఈ–ఆటోలను మొత్తం రూ.21.18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. వీటిని 36 మున్సిపాల్టి లకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ ఆటో సామర్థ్యం 500 కిలోలు అని, మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ‘ఈ– ఆటోల‘ డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇప్పటికే రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని 40 లక్షల కుటుంబాలకు తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. గ్రేడ్‌–1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్‌ టిప్పర్లను వినియోగిస్తోందన్నారు. అలాగే గుంటూరు, విశాఖపట్నంలలో వేస్ట్‌ టు ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభించిందన్నారు. త్వరలో రోజుకు 400 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement