Thursday, May 16, 2024

AP | టెంపో బోల్తా.. ముగ్గురు రైతులు దుర్మరణం

పెద్దకడబూరు, ( ప్రభ న్యూస్ ) : టెంపో బోల్తా పడి మండల పరిధిలోని నాగలాపురం గ్రామానికి చెందిన మస్తాన్ (52), బోయ యంకన్న(45), ఆటో ఈరన్న(38) అనే రైతులు దుర్మరణం చెంది, మరో నలుగురు రైతులు గాయాల పాలైన ఘటన సోమవారం చోటు చేసుకుంది.

గ్రామస్తులు, కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం సాయంకాలం నాగలాపురం, సింగరాజనహళ్లి గ్రామాలకు చెందిన దాదాపు తొమ్మిది మంది రైతులు టెంపోలో మిరప బస్తాలను వేసుకొని కర్ణాటక రాష్ట్రంలోని బ్యాడిగికి వెళ్తుండగా మార్గ మధ్యలో అర్ధరాత్రి దావణగేరి గ్రామ సమీపాన ఒక్కసారిగా టెంపో టైరు పేలి బోల్తా పడిందని తెలిపారు. టెంపో పై మిరప బస్తాల పైన కూర్చున్న రైతులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారని తెలిపారు.

ఈ ప్రమాదంలో ముగ్గురు రైతులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు రైతులు తీవ్ర రక్త గాయాల పాలయ్యారన్నారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు గమనించి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి, రైతులు దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులు మృతి చెందిన ముగ్గురు రైతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం, గాయపడిన రైతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారని తెలిపారు.

మిరపకాయలను అమ్మేందుకు వెళ్లి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తారు అనుకున్న తరుణంలో ఇలాంటి ప్రమాద సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. దీంతో మృతిచెందిన ముగ్గురు రైతులకు భార్యా పిల్లలు ఉన్నారు. మిరపకాయలు అమ్మేందుకు వెళ్లి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement