Saturday, May 18, 2024

కొత్తూరు రెవెన్యూ అధికారుల అక్రమాలపై కొండబారెడి దళం హెచ్చరిక

కొత్తూరు : కొత్తూరు రెవెన్యూ కార్యాలయం తహసీల్దార్ బాల, కొత్తూరు సచివాలయ సర్వేయర్ జగదీష్, మెట్టూరు సర్వేయర్ లక్ష్మణరావులు రైతుల నుండి డబ్బులకు కక్కుర్తి పడి భూముల రీ సర్వే లో రైతుల వద్ద మోసాలకు పాల్పడుతున్నారని రైతాంగ పోరాట కమిటీ కొండబారెడి దళం డివిజన్ కార్యదర్శి భాస్కర్ ఆరోపించారు. ఈ మేరకు అమర వీరులకు లాల్ సలాం అంటూ రైతాంగ పోరాట కమిటీ కొండబారెడి దళం డివిజన్ కార్యదర్శి భాస్కర్ పంపిన లేఖలు పోస్టల్ ద్వారా శనివారం కొత్తూరు పత్రికా విలేఖర్లకు అందాయి. రెవెన్యూ అధికారులను హెచ్చరిస్తూ కొండబారెడు దళం డివిజన్ కార్యదర్శి భాస్కర్ పంపిన హెచ్చరిక లేఖ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రియమైన కామ్రేడ్స్ తాడిత పీడిత వర్గాలైన రైతు మితుల నుండి వచ్చిన వినతులకు స్పందనగా కొత్తూరు మండల తహసీల్దార్ బాల, కొత్తూరు సచివాలయ సర్వేయర్ జగదీష్, మెట్టూరు సర్వేయర్ లక్ష్మణరావులు రైతు మిత్రులను చాలా విధాలుగా డబ్బుల కక్కుర్తితో భూమి రీ సర్వే లో మోసాలకు పాల్పడుతున్నారు. వీరికి కొత్తూరు సచివాలయ వి ఆర్ ఓ రాము అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. చోడవరపు కృష్ణారావు అనే మధ్యవర్తిని నియమించుకొని వాడి ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారు. అందువలన కొత్తూరు తహసీల్దార్ కు సర్వేయర్ జగదీష్ కి ప్రజా కోర్టులో కఠిన దండన విధించాలని తీర్మానించాం. ఇక్కడి నుండి నెల రోజుల్లోపుగా జగదీష్ కి తహసీల్దార్ కి ప్రజా కోర్టులో కఠిన శిక్ష అమలు పరిచి జగదీష్ శవాన్ని మండల రెవెన్యూ కార్యాలయానికి పంపుతాము. అలాగే రైతాంగాన్ని పీడిస్తున్న మిగిలిన వారికి కూడా సరైన సమయంలో కఠిన దండన విధిస్తాము. మా కామ్రేడ్ రైతులందరికీ విప్లవ వందనాలతో మీ భాస్కర్, డివిజన్ కార్యదర్శి రైతాంగ పోరాట కమిటీ, కొండబారెడు దళం అని ఈ హెచ్చరిక లేఖ ముగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement