Thursday, April 25, 2024

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య అల్పపీడన ద్రోణి బలపడిందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని చెప్పింది. సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉందని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇక ఏపీలో నేడు, రేపు విస్తారంగా వానలు కురవనున్నాయి. కోస్తాలో నేడు చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల మాత్రం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. అలాగే, కోస్తా తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మరోపక్క, బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉన్నట్టు వివరించింది. దీని ప్రభావంతో రేపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement