Friday, May 3, 2024

492 మందులకు ధర ఒప్పందం… వైజాగ్‌ కేజీహెచ్‌కు త్వరలోనే కొత్త సిటీ, ఎమ్మారై మిషన్లు..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో 492 ఔషధాల కొనుగోలుకు ధర ఒప్పందం కుదుర్చుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజని స్పష్టం చేశారు. అదే పొరుగు రాష్ట్రాల్రు తీసుకుంటే తెలంగాణ 378, తమిళనాడు 348, బీహార్‌ 253 రకాల ఔషధాలకు మాత్రమే కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నాయని వివరించారు. రాష్ట్ర సచివాలయం ఐదో బ్లాక్‌లోని కలెక్టర్స్‌ కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం మంత్రి విడదల రజని ఏపీఎంఎస్‌ ఐ డీసీ (ఆంధ్రప్రదేశ్‌ వైద్య సేవలు, వసతుల అభివృద్ధి సంస్థ) విభాగంపై పూర్తి స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదలందరికీ నాణ్యమైన వైద్యం పూర్తి ఉచితంగా, సులువుగా అందాలనే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎంతో ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో అందుబాటు-లోకి తీసుకొస్తున్నామని, అన్ని ఔషధ నిల్వల కేంద్రాలను పూర్తిస్థాయిలో పటిష్టపరుస్తున్నట్లు తెలిపారు. అన్ని సెంట్రల్‌ మెడికల్‌ స్టోర్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని కేంద్రాలకు అదనం ఒక డీఈవోను, మరో ఇద్దరు ప్యాకర్లను నియమిస్తున్నామన్నారు. సీఎంఎస్‌లో పనిచేసే సిబ్బంది ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా డ్రస్‌ కోడ్‌ అందజేస్తున్నామని తెలిపారు.

ఆస్పత్రులకు పూర్తిస్థాయిలో పరికరాలు..

విశాఖపట్టణంలోని కేజీహెచ్‌కు సిటీ , ఎమ్మారై యంత్రాలను అతి త్వరలోనే అందజేస్తామన్నారు. జీజీహెచ్‌ కాకినాడ, జీజీహెచ్‌ కర్నూలుకు క్యాత్‌ల్యాబ్‌ను కూడా అతి త్వరలోనే సమకూరుస్తామన్నారు. తాజాగా కోవిడ్‌ కేసులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులకు ప్రత్యేకంగా పరికరాలు అందుబాటులో ఉంచేందుకు రూ.130 కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. యూపీహెచ్‌సీలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఈ ఏడాది చివరికల్లా సేవలు అందజేయబోతున్న నేపథ్యంలో ఆయా ఆస్పత్రులకు రూ.220 కోట్లతో ప్రత్యేకంగా పరికరాలను అందజేస్తున్నామని చెప్పారు. ఆయా పరికరాలన్నీ సమయానికల్లా ఆస్పత్రులకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కర్నూలులోని జీజీహెచ్‌లో క్యాన్సర్‌ కేర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో రూ.90 కోట్ల విలువైన క్యానర్స్‌ వ్యాధి చికిత్స పరికరాలను అందజేయబోతున్నామని చెప్పారు.

మందుల కొరత లేకుండా చూడండి..

వర్షాకాలం సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో సీజనల్‌ వ్యాధుల మందుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి విడదల రజిని స్పష్టంచేశారు. ఇప్పటినుంచే -టె-ండర్లు పిలిచి మందులు అందుబాటు-లో ఉండేలా చూడాలని ఆదేశించారు. టెండర్ల విషయంలో ఎక్కడా విమర్శలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అవినీతి, అక్రమాలు లేని స్వచ్ఛమైన పాలనే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని, ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, యూహెచ్‌సీలు, ఐదు మెడికల్‌ కళాశాలల నిర్మాణం ఈ ఏడాది చివరికల్లా పూర్తి కావాల్సి ఉందని, ఆ పనులు సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ చంద్రశేఖరరెడ్డి, ఏపీఎంఎస్‌ ఐ డీసీ ఎండీ మరళీధర్‌రెడ్డి, ఏపీఎం ఎస్‌ ఐడీసీ విభాగానికి చెందిన అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement