Friday, May 17, 2024

భోజ‌నం చేసి వ‌చ్చేలోగా … కారులోని రూ.5ల‌క్ష‌లు మాయం

చేజర్ల : కడుపు నిండా అన్నం తిని ఆకలి తీర్చుకునే లోపే గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలు పగుల గొట్టి 5 లక్షల రూపాయలు నగదును ఎత్తుకెళ్లిన సంఘటన చేజర్ల మండల పరిధిలోని ఆదూరు పల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.నిమిషాల వ్యవధిలోనే ఈ చోరీ జరిగిపోయింది. అందిన సమాచారం మేరకు వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఖాదర్ బాషా, ఆదూరుపల్లికి చెందిన ఓ వ్యక్తి దగ్గర కారుని బేరం చేసుకున్నారు. అయితే ముందుగా రూ.50వేలు అడ్వాన్స్ చెల్లించారు. మిగతా ఐదు లక్షలు నగదును కారు యజమానికి ఇచ్చేందుకు ఆదురుపల్లికి చేరుకున్నారు. ఇంతలోపు మధ్యాహ్న భోజన సమయం కావడంతో పొదలకూరు-నెల్లూరు ప్రధాన రహదారి పక్కన కారు పార్కు చేసి అక్కడే ఉన్న ఓ హోటల్ లోకి వెళ్ళి భోజనం చేసుకుని వచ్చే లోపే కారులో అద్దాలు పగలగొట్టి.. అందులో ఉన్న ఐదు లక్షల రూపాయల నగదును అపహరించుకొని వెళ్లారు. భోజనం చేసి కారు దగ్గరికి వచ్చిన బాధితుడు చోరీ జరిగిన విషయం గుర్తించి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నట్లు స్థానిక ఇంచార్జ్ ఎస్సై రాజేష్ తెలిపారు. చోరీ సంఘటనపై స్థానికులైన కొందరు వ్యక్తుల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement