Thursday, July 25, 2024

KNL: ప్రభుత్వం గుర్తింపు లేని నారాయణ పాఠశాలను సీజ్ చేయాలి..

ఏఐఎస్ఎఫ్, పీ డీ ఎస్ యూ, ఏఐఎస్ఎ డీఈవో కి వినతి
లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరిక
కర్నూలు బ్యూరో : ప్రభుత్వ గుర్తింపు లేకుండా అడ్మిషన్ చేస్తున్న నారాయణ పాఠశాలను సీజ్ చేయాలని పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి.సోమన్న, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏ.నాగరాజు డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం నందు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) కు ఇవాళ‌ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కర్నూలు నగరంలో జోహారాపురం నందు ప్రభుత్వ గుర్తింపు లేకుండా, బిల్డింగ్ నిర్మాణం కాకుండా అక్రమంగా అడ్మిషన్ లు చేస్తున్న నారాయణ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలన్నారు. విద్యా అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాకపోయినా అక్రమంగా అడ్మిషన్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నారాయణ పాఠశాలలో టెక్నో, ఈ టెక్నో ఒలంపియాడ్, సిఓ, కోర్సుల పేరుతో అక్రమంగా అడ్మిషన్ చేస్తూ వేలకు వేలు ఫీజులు వసూలు చేసుకుంటున్నారన్నారు. కొత్త కొత్త పేర్లతో, కోర్సులతో అడ్మిషన్ చేసుకుంటే వారిపైన జరిమానా విధించాలని విద్యాశాఖ అధికారులు జీవోలు అమలు చేస్తున్నారు, కానీ కర్నూలు నగరంలో నారాయణ పాఠశాల ప్రభుత్వ జీవోలను, విద్య అధికారులను లెక్కచేయకుండా బహిరంగంగా ఫ్లెక్సీల రూపంలో, కరపత్రాల రూపంలో కొత్త కొత్త కోర్సుల పేరుతో అడ్మిషన్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే ప్రభుత్వ జీవో నెంబర్ 48 ప్రకారం పాఠశాలపై జరిమాన విధించి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అక్రమంగా పాఠశాలలో పుస్తకాలు, దుస్తులను బహిరంగంగా సరుకుల్లాగా అమ్ముతున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నారాయణ పాఠశాలల‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర కోశాధికారి అశోక్, పీడీఎస్ యూ నగర అధ్యక్షుడు దామోదర్, నగర నాయకులు నవనీత్, వర్ధన్, ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి నాని, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement