Thursday, May 2, 2024

అడుగడుగునా లోకేశ్‌కు వినతులు.. అధికారంలోకి రాగానే ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ..

కర్నూలు జిల్లో పత్తికొండ నియోజకవర్గం శభాష్ పురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
శభాష్ పురం గ్రామంలో సాగు, తాగునీటి సమస్య అధికంగా ఉందనీ నారా దృష్టికి తెచ్చారు. వేసవిలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్, పైప్ లైన్, కుళాయిలు లేకపోవడంతో కిలోమీటరు దూరంలో ఉన్న పొలాల బోర్ల వద్దకువెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తోందనీ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో గ్రామంలో బోర్లు వేయించారు, పైప్ లైన్ వేసేలోపు ప్రభుత్వం మారిపోవడంతో పనులు నిలచిపోయాని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించకపోవడంతో ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వస్తుందన్నారు. పత్తికొండ, తుగ్గలిలో ఎటువంటి పరిశ్రమలు లేకపోవడంతో నిరుద్యోగులకు పొట్టచేతబట్టుకొని సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందనీ నారాతో వాపోయారు. ఈ సంద‌ర్భంగా యువనేత లోకేష్ మాట్లాడుతూ.. టిడిపి ప్రభుత్వ హయాంలో జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికీ తాగునీరు అందించే పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. 30శాతం పనులు పూర్తయ్యాక ప్రభుత్వం మారిపోయింది. వైసిపి అధికారంలోకి వచ్చాక ఆ పథకానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వకుండా పనులు ఆపేసిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ కుళాయి పథకాన్ని పూర్తి చేస్తామన్నారు. పత్తికొండ నియోజకవర్గంలో సోలార్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

యువనేత లోకేష్ ను కలిసిన కలచట్ల గ్రామస్తులు
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం కలచట్ల గ్రామస్తులు శనివారం టిడిపి యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. గ్రామంలో అంతర్గత రోడ్లను తవ్వేసి వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. వేసవిలో తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నామ‌న్నారు. గ్రామ చెరువును హంద్రీనీవా జలాలతో నింపాలని కోరారు. గ్రామంలో ఇళ్లు లేనివారికి పక్కా గృహాలు నిర్మించాలని విన్నతించారు. ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డికి దోచుకోవడం, దాచుకోవడం తప్ప గ్రామాల అభివృద్ధిపై శ్రద్ధలేదన్నారు. టిడిపి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.25 వేల కి.మీ సిసి రోడ్లు వేశామ‌ని, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కలచట్ల చెరువుకు హంద్రీనీవా నీళ్లిస్తామ‌న్నారు. గ్రామంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement