Friday, April 26, 2024

తన గెలుపునకు ఆయనే కారణం.. జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి, ఏప్రిల్ 26 (ప్రభన్యూస్): డీఓఎస్పీ చైతన్య ఎక్కడ ఉంటే అక్కడ అధికార పార్టీ అభ్యర్థులు ఓటమిపాలవుతారని, గత మున్సిపల్ ఎన్నికల్లో తన విజయానికి కారణం డీఓఎస్పినే అంటూ తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చేపట్టిన దీక్ష శిబిరంలో విలేకరులతో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. డీఓఎస్పీ చైతన్య బదిలీపై రాజంపేటకు పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని, చైతన్య ఎక్కడ ఉంటే అక్కడ అధికార పార్టీ అభ్యర్థులు ఓటమిపాలవుతారని ఈ విషయాన్ని రాజంపేట ఎమ్మెల్యేకు కూడా సూచించానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

గత మున్సిపల్ ఎన్నికల్లో తన విజయానికి కారణం చైతన్య అని తాడిపత్రికి వచ్చిన కొత్తలో తనతో బాగా మాట్లాడేవారని ఆయన అన్నారు. డీఓఎస్పీ వల్లనే తనకు మంచి పబ్లిసిటీ వచ్చిందని, శాంతియుతంగా మున్సిపల్ కార్యాలయంలో తమ కౌన్సిలర్లు నిరసన కార్యక్రమం చేపట్టారని నిరసన కార్యక్రమానికి వెళుతుంటే డీఓఎస్పీ హల్చల్ చేశారని, హౌస్ అరెస్ట్ అంటూ అడ్డుకొని వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నం చేశారని దీంతో ప్రజల్లో మంచి ప్రచారం లభించిందని ఆయన ఎద్దేవా చేశారు. మళ్లీ డీఓఎస్పీ చైతన్య తాడిపత్రికి వస్తాడని ఆయన అన్నారు. ఎక్కడ ఉన్నా కుటుంబంతో బాగుండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement