Monday, April 29, 2024

ఉద్యోగుల పొదుపు, పరపతి సంఘంలో ఇంత‌కీ స్వాహా సొమ్మెంత‌?

అమరావతి, ఆంధ్రప్రభ: క్రమశిక్షణకు మారుపేరైన కేంద్ర ప్రభుత్వ సెంట్రల్‌ ఎక్సైజ్‌, కస్టమ్స్‌(సీజీఎస్టీ) ఉద్యోగుల పొదుపు, పరపతి సంఘం నిధుల దుర్వినియోగంలో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. స్వాహా నిధుల మొత్తంపై ఒక్కొక్కరూ ఒక్కొక్క అంకెను పేర్కొనడం ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది. రూ.9కోట్లకు పైబడి ఉద్యోగుల సొమ్ము దారి మళ్లినట్లు గుర్తించిన సహకార శాఖ. రూ.7.46 కోట్ల నిధుల దుర్వినియోగంపై మాత్రమే పాలక మండలి నుంచి వివరణ కోరింది. ఇదే కేసుకు సంబంధించి పోలీసు శాఖ రూ.6.35 కోట్ల మేర నిధులను దారి మళ్లించినట్లు పేర్కొనడం గమనార్హం. నిధుల దుర్వినియోగంలో శాఖల మధ్య సమన్వ య లోపం, విచారణలో లోపించిన స్పష్టత కొట్టొచ్చినట్లు కని పించడమే ఉద్యోగుల ఆందోళనకు కారణంగా చెప్పొచ్చు. నిధు ల దుర్వినియోగంలో రిటైర్డు ఇన్‌స్పెక్టర్‌ జేఏస్‌ చక్రవర్తి పాత్ర కీల కమైనప్పటికీ, ఇతరుల ప్రమేయం కూడా విస్మరిం చలేమ నేందుకు తాజా పరిణామాలే నిదర్శనం. విచ్చలవిడిగా నిధుల దుర్వినియోగం జరుగుతున్నట్లు మూడేళ్ల కిందటనే ఉద్యోగు లు వెలుగులోకి తెచ్చారు. అయినా పాలకవర్గం పట్టిం చుకోలె దు. ఇప్పుడు తీరా సహకార శాఖ జారీ చేసిన నోటీసుల నేపథ్యం లో తమ సంతకాలు ఫోర్జరీ చేసినట్లు చెపుతున్నారు. సంతకాల ఫోర్జరీపై పోలీసు కేసు ఎందుకు పెట్టలేదనే దానిపై పాలక వర్గం నుంచి సమాధానం లేదని ఉద్యోగులు చెపుతున్నారు.

అసలేం జరిగింది..
కేంద్ర ప్రభుత్వ సెంట్రల్‌ ఎక్సైజు(సీజీఎస్టీ) ఉద్యోగుల పరపతి సంఘంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం వెలుగు చూసింది. సర్వీసు, పదవీ విరమణ చెందిన సీజీఎస్టీ ఉద్యోగులు పొదుపు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సొమ్మును సంఘం కార్యదర్శిగా వ్యవహరించిన జేఎస్‌ చక్రవర్తి దారిమళ్లించినట్లు ఆరోపణలు వెలుగు చూశాయి. 2020లోనే నిధుల దుర్విని యోగం వెలుగు చూసినప్పటికీ..గత జూలైలో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు చక్రవర్తిని అరెస్టు చేయగా..ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ క్రమంలోనే గత జూలై 31న చక్రవర్తి పదవీ విరమణ చేశారు. ఇదిలా ఉంటే నిధుల దుర్వినియోగంపై ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర సహకార శాఖ సెంట్రల్‌ ఎక్సైజు సొసైటీ పాలకవర్గానికి నోటీసులు చారీ చేసింది. నిధుల దుర్వినియోగం, మోసపూరిత వసూల్లు, అక్రమ రుణాల వంటి చర్యల ద్వారా దారిమళ్లిన సొమ్మును రూ.9 కోట్ల 12లక్షల 21వేల 34 రూపాయలుగా నోటీసుల్లో పేర్కొన్నారు. రూ.7కోట్ల 45లక్షల 69వేల 934 రూపాయలకు పూర్వ, ప్రస్తుత పాలక వర్గం సభ్యులు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. మిగిలిన రూ.కోటి 66లక్షల 51వేల వంద రూపాయల అంశాన్ని అధికారులు విస్మరించిన ట్లు ఉద్యోగులు చెపుతున్నారు. ఇదే నోటీసుల్లో రూ.ఐదు కోట్ల 18లక్షల 89వేల 660 ఒక్క చక్రవర్తి ద్వారానే గోల్‌మాల్‌ అయినట్లు నోటీసుల్లో వెలుగు చూసింది. 2014 -2020 వరకు అక్రమాలు చోటు చేసుకున్నట్లు సహకార శాఖ తెలిపింది. కస్టమ్స్‌ ఉద్యోగులు జె.రాంబాబు, పి.భాగ్యారావుకు చెందిన రూ.60లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మొత్తాలను వారి ప్రమేయం లేకుండానే స్వాహా చేసినట్లు సహకార శాఖ గుర్తించింది.

ఇంతింతై..వటుడింతై..
తొలి రోజుల్లో కొద్ది మొత్తాలనే దారి మళ్లించిన చక్రవర్తి తదితరులు..ఆ తర్వాత కాలంలో పెద్ద ఎత్తున నిధుల దుర్విని యోగానికి పాల్పడ్డారు. ఉద్యోగులకు తెలియకపోవడం, పాలక వర్గం పెద్దగా పట్టించుకోక పోవడంతో చక్రవర్తి కార్యదర్శి హోదాలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. సహకార శాఖ నోటీసులో పేర్కొన్న వివరాల ప్రకారం..అత్యవసర, స్వల్పకా లిక రుణాల కింద 2014-15 లో రూ.14 లక్షల 30వేలు, 2015-16లో రూ.8లక్షల 50 వేలు, 2016-17లో రూ.5 లక్షలు, 2017-18లో రూ.48 లక్షల 90 వేలు, 2018-19లో 20 వేలు నిధుల దుర్వినియోగం స్పష్టం చేశారు. ఇవి కాక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఉద్యోగుల జీతాల నుంచి ఉప సంహరించిన నగదును రికార్డుల్లో పేర్కొనకపోవడం..ప్రతీదీ అవకాశంగా చేసుకొని అందినకాడికి దోచుకున్నట్లు చెపుతున్నారు.

సొసైటీలో నిధుల దుర్వినియోగంపై ఆయా కాలాల్లో పని చేసిన 15మంది పాలక వర్గం సభ్యులకు సహకార శాఖ నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. 2019-20 లో సోసైటీ- బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.55 లక్షల 47 వేల 102 రూపాయలు విత్‌ డ్రా చేయడంపై అప్పటి పాలకవర్గంలోని పీ.వెంకటేశ్వరమ్మ, బీ.లక్ష్మణరావు, జేఏస్‌ చక్వర్తి, ఏ.రేవంత్‌, ఎం.మల్లిఖార్జున రావు, శేఖర్‌, రామకోటేశ్వరరావు తదితరులకు నోటీసులు జారీ చేశారు. ఉద్యోగుల నుంచి సేకరించిన రూ.94లక్షల 42వేల 873 ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను సంస్థ ఖాతాల్లో చూపకపోవడంపై చక్రవర్తితో పాటు అప్పట్లో అధ్యక్షులుగా వ్యవమరించిన ఎం.నాగరాజు, ఎల్‌.జానకీ రామయ్యను వివరణ కోరారు. అన్నింట్లో చక్రవర్తి పాత్ర స్పష్టమైనప్పటికీ..ఇతరుల ప్రమేయం పై కూడా సహకార శాఖ దృష్టిసారించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నోటీసులు అందుకున్న వారంతా అప్పట్లో తమ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు పేర్కొన్నట్లు తెలిసింది. అది తెలిసిన తర్వాత పోలీసు కేసు ఎందుకు పెట్టలేదనేది ఇప్పుడు ఉద్యోగుల నుంచి వస్తున్న ప్రశ్న. ఎంతోకొంత వీరి ప్రమేయం లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement