Friday, May 3, 2024

Indrakiladri: వైభవంగా ఆదిదంపతుల గిరిప్రదక్షిణ.. అమ్మ‌వారి నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమ్రోగిన ఆల‌యం

(ఎన్టీఆర్ బ్యూరో, ప్రభ న్యూస్)
పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి చుట్టూ ఆదిదంపతుల గిరిప్రదక్షిణ అత్యంత వైభవంగా కొనసాగింది. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి. ఇంద్రకీలాద్రి చుట్టూ జరిగిన ఈ గిరి ప్రదక్షణలో అమ్మవారి నామస్మరణ మారుమ్రోగింది.

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం లోకకళ్యాణార్థం, భక్త జనశ్రేయస్సు, ధర్మప్రచారం నిమిత్తం వేదపండితుల మంత్రోశ్చ‌రణలు, అమ్మవారి నామ స్మరణలు, మంగళ వాయిద్యాల‌ నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం (ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద) వద్ద శ్రీ స్వామి, అమ్మవార్లుకు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్విహించి, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావుచే కొబ్బరి కాయ కొట్టి గిరిప్రదక్షిణ కార్యక్రమంను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు బచ్చు మాధవీ కృష్ణ, చింకా శ్రీనివాసులు, కార్యనిర్వాహక ఇంజినీర్ కోటేశ్వరరావు, సహాయ కార్యనిర్వాహనాధికారులు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ కార్యక్రమము శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, నాలుగు స్థంబాల సెంటర్, సితార, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టి నగర్, కొత్తపేట, నెహ్రు బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాల నృత్యములు తదితర సాంస్కృతిక కార్యక్రమముల నడుమ తిరిగి ఆలయమునకు చేరుకున్నారు. గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు, స్వామి వార్లకు భక్తిశ్రద్దలతో పూలు, పండ్లు, కొబ్బరికాయ లు సమర్పించి, పూజలు చేసి, అమ్మవారిని, స్వామి వారిని ప్రార్థించి, అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement