Thursday, April 25, 2024

AP: సోలార్ ఎనర్జీ ఒప్పందంతో నిరంతరాయంగా రైతులకు ఉచిత కరెంట్.. జగన్

తాడేపల్లి, కర్నూలు, ఆగస్టు 23, ప్రభ న్యూస్ బ్యూరో : సోలార్ ఎనర్జీ ఒప్పందంతో నిరంతరాయంగా రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. దేశంలోనే అతిపెద్ద మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లాలో ఏర్పాటు కానున్న సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా ఆయన శంకుస్థాపన చేయడం గమనార్హం. ఈ ప్రాజెక్టుతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కలగనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. 8వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. పర్యావరణ హితంగా ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు. సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. సోలార్‌ ఎనర్జీ కోసం రూ.2.49 పైసలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుల కోసం ఎన్ హెచ్ పి సి తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్‌ విషయంలో ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని, గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేసే విషయంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు.

భవిష్యత్తు తరాలకు గ్రీన్‌ ఎనర్జీ…
పంప్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టుల వల్ల భవిష్యత్తు తరాలకు గ్రీన్‌ ఎనర్జీ అందుతుందన్నారు. కాలుష్య కారక విద్యుత్‌పై ఆధారపడే పరిస్థితి క్రమేణా తగ్గుతుందన్నారు. భవిష్యత్తులో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషించనున్నట్లు చెప్పారు. వీటికి అనుబంధంగా సోలార్‌, విండ్‌ ప్రాజెక్టులు అనుసంధానం అవుతున్న తీరు గ్రీన్‌ ఎనర్జీలో విప్లవానికి నాందిగా పేర్కొన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం వరకూ సోలార్‌ వస్తుందన్నారు. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు విండ్‌ ఎనర్జీని వాడుకోవచ్చన్నారు. పీక్‌ అవర్స్‌లో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులను వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఒక కృత్రిమ బ్యాటరీగా పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు పనిచేస్తాయన్నారు. కాలుష్య రహిత విద్యుత్‌ ఉత్పాదనలో ఏపీ మొదటి స్థానంలో నిలిచేలా ఈ అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీలో 8999 మెగావాట్లకు సంబంధించి సోలార్‌, విండ్‌ పవర్‌ ఉందన్నారు. రైతులకు ఉచితంగా పగటిపూటే విద్యుత్తు అందుబాటులోకి రావాలనేది ప్రభుత్వ కాంక్షగా పేర్కొన్నారు. 7200 మెగావాట్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో రూ.2.49లకే ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.


రైతులకు ఉచితంగా కరెంటును సమర్థవంతంగా కొనసాగించేందుకు, ఢోకా లేకుండా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తుందన్నారు. తక్కువ ధరకే కరెంటు వస్తున్నందువల్ల ప్రభుత్వానికి, జెన్‌కోకు వెసులుబాటు కలుగుతుందన్నారు. ఇవన్నీ ఒకవైపున చేస్తుండగానే పంప్డ్‌ స్టోరేజీని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేల మెగావాట్ల ప్రాజెక్టులకు సంబంధించి లొకేషన్లను గుర్తించామన్నారు. మొత్తం 29ప్రాజెక్టులకు సంబంధించి 33వేల మెగావాట్లకు పైగా ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేశామన్నారు. కొన్ని డీపీఆర్‌లు కూడా సిద్ధం అయినట్టు తెలిపారు. వీటిని వివిధ బడా కంపెనీలకు అలాట్‌మెంట్‌ కూడా చేశామన్నారు. ఇందులో భాగంగానే నేడు ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం చేసుకుంటున్నామన్నారు. యాగంటిలో, కమలపాడులో దాదాపుగా 2వేల మెగావాట్లకు సంబంధించి రూ.10వేల కోట్లతో చెరిసగం వాటాతో ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంఓయూ కుదుర్చుకుంటున్నట్లు చెప్పారు. ఈ రెండు సంస్థలూ మరింతగా అడుగులు ముందుకేసేందుకు మరో 3700 మెగావాట్లకు సంబంధించిన ఫీజుబిలిటీ స్టడీలు జరుగుతున్నాయన్నారు.

- Advertisement -

దేశానికే ఆదర్శం..
రాబోయే రోజుల్లో ఈప్రాజెక్టులను కూడా చేపట్టేందుకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ సంస్థల విద్యుత్‌ ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, ప్రయివేటు కంపెనీలను కూడా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. గ్రీన్‌ ఎనర్జీ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తామన్నారు. 2300 మెగావాట్ల సౌరవిద్యుత్‌ గ్రీన్‌ కో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నట్లు వెల్లడించారు. 2300 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ఆర్సెలర్‌ మిట్టల్‌ కూడా 1014 మెగావాట్ల సోలార్‌, విండ్‌ పవర్‌ పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. దాదాపు వేయి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ఎకోరన్‌ సంస్థ 2వేల మెగావాట్ల పునర్‌ ఉత్పాదక ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేస్తున్నామని, వీటివల్ల మరో 2వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుందన్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో స్థానికంగా మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ప్రతి మెగావాట్‌ ఉత్పత్తికి ఆ ప్రాజెక్టుల లైఫ్‌ ఉన్నంతకాలం రాయల్టీ కింద రూ.1లక్ష చొప్పున వస్తుందన్నారు. జీఎస్టీ ఆదాయం కూడా ప్రభుత్వానికి సమకూరుతుందన్నారు.సహకారం అందిస్తున్న రైతులకు, రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటూ ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.31వేలు లీజు చొప్పున వస్తుందన్నారు. ప్రతి రెండేళ్లకు 5శాతం లీజు రుసుము పెరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకూ మంచి జరుగుతుందనీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దశాబ్దాలుగా నీళ్లకు కటకటలాడే ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుల కారణంగా రైతులకు మంచి జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల వస్తున్న ఉపాధి రూపంలోనే కాకుండా, జీఎస్టీ ఆదాయమే కాకుండా, రైతులకూ, ప్రభుత్వానికి భూములు ఇచ్చినందుకు లీజు రూపంలో డబ్బు వస్తుందన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా పర్యావరణానికి మేలు జరుగుతుందన్న అభిప్రాయం ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement