Monday, June 10, 2024

Criminal Case – మాచ‌ర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి విశ్వ‌రూపం – ఏకంగా ఏడు ఈవిఎంలు ధ్వంసం


మాచ‌ర్ల‌లోని ప‌లు పోలింగ్ కేంద్రాల‌లో వీరంగం
పోలింగ్ ఏజెంట్ల‌పై దౌర్జ‌న్యం
వెబ్ కాస్ట్ వీడియోల‌తో వెలుగు చూసిన ఎమ్మెల్యే దౌర్జ‌న్యాలు
త‌క్ష‌ణం ఆయ‌న‌పై క్రిమిన‌ల్ కేసుల న‌మోదు చేయాల‌ని ఈసి ఆదేశం
ఎన్నిక‌ల‌లో పాల్గొన‌కుండా నిషేధం విధించే అవ‌కాశం

ఎన్నికల వేళ విధ్వంసానికి దిగిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విశ్వరూపం బయటపడింది. తాను ఎమ్మెల్యే అభ్యర్థి అనే విషయాన్ని మరిచిపోయారు. వీధి రౌడీ మాదిరిగా ప్రవర్తించారు.. అడ్డంగా దొరికిపోయారు. పోలింగ్ రోజు ఓ బూత్‌కి వెళ్లి ఈవీఎంలను నేల కేసి కొట్టారాయన. అందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీని త‌ర్వాత ఇక్క‌డ ప‌లు కేంద్రాల‌లోని వెబ్ క్యాబ్ లు ప‌రిశీలించిన అధికారులు విస్తుపోయే నిజాలు వెలుగు చూశారు.. ఇదే త‌ర‌హాలో మ‌రో ఆరు కేంద్రాల‌లో ఎమ్మెల్యే ఈవిఎం లు ధ్వంసం చేసిన‌ట్లు రూడీ అయింది.. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పీఎస్‌ నంబర్‌ 202తో పాటు 7 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారని ఏపీ సీఈవో కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

- Advertisement -

దీనికంటే ముందు మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయిగేటు ప్రాంతం. సింపుల్‌గా చెప్పాలంటే టీడీపీ గట్టి పట్టుకున్న ప్రాంతం. మే 13న పోలింగ్ సందర్భంగా ఆ గ్రామంలోని తన అనుచరులతో కలిసి ఓ పోలింగ్ బూత్‌లోకి వెళ్లారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈవీఎంను రెండు చేతులతో పైకి ఎత్తి నేలకేసి కొట్టారు. ఈవీఎంలతోపాటు వీవీ ప్యాట్ కిందపడి డ్యామేజ్ అయ్యాయి. ఈ సమయంలో ఓటు వేస్తున్న ఓ వ్యక్తి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు.

టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పిన్నెల్లిపైకి దూసుకెళ్లారు. ఆయన అనుచరులు అడ్డుకున్నారు. బూత్ నుంచి బయటకు వెళ్తూ పిన్నెల్లి.. టీడీపీ ఏజెంట్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులుగానీ, పోలింగ్ సిబ్బంది ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎమ్మెల్యే అభ్యర్థి వస్తున్న క్రమంలో పోలింగ్ సిబ్బంది నిలబడి ఆయనకు నమస్కారం పెట్టడం గమనార్హం.

ఇక ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ, ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఈవో ముఖేష్ కుమార్ మీనా డిజిపిని ఆదేశించారు.. ఏడు ఈవీఎంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేశారు. విచారణలో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చారు.. . తద్వారా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయరని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈవీఎం ధ్వంసానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఘ‌ట‌న‌కు బాధ్యులైన వారంద‌ర్ని ఆరెస్ట్ చేయాల‌ని కూడా మీనా కోరారు.. అలాగే ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎమ్మెల్యే పై క్రిమిన‌ల్ చ‌ర్య‌ల‌తో పాటు భ‌విష్య‌త్ లో ఎన్నిక‌ల‌లో పాల్గొన‌కుండా నిషేదం విధించే అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement