Saturday, May 18, 2024

కొత్త జిల్లాలను కలుపుతూ జాతీయ రహదారుల నిర్మాణం.. నితిన్‌ గడ్కరీతో జ‌గ‌న్ భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు రోడ్డు ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విడుదలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, అమిత్‌షాలతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, ఆర్థిక అంశాల గురించి సమగ్రంగా చర్చలు జరిపారు. బుధవారం కేంద్ర రోడ్లు, రవాణా, జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీతో ఉదయం 9.15 గంటలకు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక రోడ్డు ప్రాజెక్టులపై చర్చించారు. విశాఖ-భోగాపురం బీచ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని మేలైన ఆలోచనలు చేయాలంటూ గత రాష్ట్ర పర్యటనలో గడ్కరీ ఇచ్చిన సలహా మేరకు అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని గడ్కరీకి వివరించారు. విశాఖ నుంచి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డుతో పాటు, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు.

విజయవాడ వెస్ట్రన్‌ బైసాస్‌ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, దీనికి సీఆర్డీఏ గ్రిడ్‌ రోడ్డును అనుసంధానం చేసి పనులు ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని అడిగారు. విజయవాడ వెస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌కు భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, ఈ భూములను కూడా గుర్తించిందని వెంటనే డీపీఆర్‌ సిద్ధంచేసి పనులు ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడ ఈస్ట్రన్‌ బైపాస్‌కు సంబంధించి కూడా డీపీఆర్‌ సిద్ధంచేసి పనులు వేగవంతంగా చేపట్టేలా తగిన చర్యలు, రాష్ట్రంలో 20 ఆర్వోబీలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే మంజూరు చేసిందని, మిగిలిన 17 ఆర్వోబీలనూ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్లను కలుపుతూ 1723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, కొత్తగా ఏర్పడ్డ జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నితిన్ గడ్కరీని సీఎం అభ్యర్థించారు. రాష్ట్రంలో దాదాపు 14 ప్రాంతాల్లో రోప్‌ వేల నిర్మాణానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు పంపించిందని, ఇప్పటికే 2 చోట్ల నిర్మాణానికి అంగీకారం తెలిపారని, మిగిలిన ప్రతిపాదనలకూ అనుమతినివ్వాలని కేంద్రమంత్రికి జగన్మోహన్ రెడ్డి వినతి చేశారు. నితిన్ గడ్కరీతో సమావేశం అనంతరం ఆయన ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ తిరిగి వెళ్లిపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement