Thursday, May 2, 2024

TTD EO: రూ.1.36కోట్లతో అలిపిరి విశ్రాంతి మండపం పనులు..

తిరుపతి ప్రతినిధి : 16వ శతాబ్దంలో సాళువ నరసింహారాయ వారిచే అలిపిరి వద్ద శ్రీ లక్ష్మినారాయణ స్వామి ఆలయం నిర్మించారు. అదే సమయంలో ఆలయానికి ఇరువైపులా భక్తులు సేద తీరేందుకు రెండు విశ్రాంతి మండపాలను నిర్మించడం జరిగింది. ప్రస్తుతం కాలిబాటలోని భక్తుల విశ్రాంతి కోసం నిర్మించిన కుడివైపు మండపం శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉందని, దీనిపై టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ మండపాన్ని తొలగించి తిరిగి యధావిధిగా పునర్నిర్మిస్తున్నట్టు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.

మండపం తొలగించే సమయంలో మండపంలో ఉన్న విలువైన రాతి కట్టడాలను అలాగే భద్రపరిచి కొత్తగా నిర్మించే ఆలయ పున నిర్మాణంలో వాటిని యధావిధిగా వాడనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ మండపం జీర్ణోదరణ నిర్మాణానికి గాను రూ.1కోటి 36 లక్షలు మంజూరు చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఉదయం అపిపిరి వద్ద శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్న మండపాన్ని మీడియాకు చూపించారు. గతంలో తిరుమలలోని పార్వేటి మండపం తొలగింపు సమయంలోనూ కొందరు రాజకీయ పార్టీల ముసుగులో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని, ప్రస్తుతం ఆ మండపం నిర్మాణం కూడా దాదాపు పూర్తికావస్తొందని గుర్తు చేశారు.

ప్రస్తుతం అలిపిరి వద్ద శిథిలావస్థకు చేరుకున్న మండపాన్ని సైతం పార్వేటి మండపం తరహాలోనే నిర్మించనున్నట్లు తెలిపారు. దీనిపై ఎవరైనా సోషల్ మీడియాలో టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ పార్టీ నాయకులు ఎవరికైనా అనుమానాలు ఉంటే నేరుగా వచ్చి కాలిబాటలో శిథిలావస్తకు చేరుకుని మండపాన్ని పరిశీలించాలని సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement