Saturday, May 4, 2024

BJP Maha Dharna – సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా జ‌గ‌న్ మార్చారంటూ పురందేశ్వ‌రీ ఫైర్

ఒంగోలు . రాష్ట్రంలో సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా జ‌గ‌న్ మార్చారు అని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. పంచాయతీల్లో నిధులు లేక అప్పులు చేసి సర్పంచ్ లు పని చేస్తున్నార‌ని,. సర్పంచ్ లకు నిధులు రాకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్న పాపం ఈ ప్రభుత్వానిదే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స‌ర్పంచ్ ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ఒంగోలు కలెక్ట‌రేట్ వ‌ద్ద బీజేపీ తలపెట్టిన మహాధర్నాలో పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా చేసిన పనులకు నిధులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అన్నారు. ఈ ఆత్మహత్య ల పాపం జగన్మోహన్ రెడ్డి ది కాదా అంటూ రాజ్యాంగ బద్దమైన సర్పంచ్ వ్యవస్థని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది అని విమర్శలు గుప్పించారు. కేంద్రం పంచాయతీలకు ఇచ్చే నిధులను జగన్ సర్కార్ పక్కదారి పట్టిస్తుందని ఏపీ బీజేపీ అధక్షురాలు ఆరోపించారు.

సర్పంచ్ లకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ గళం విప్పిన తరువాత వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు చెప్పారని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. 600 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లుల కోసం ఆపడం దారుణమ‌న్నారు. మహాత్మా గాంధీని కూడా అవమాన పరిచే విధంగా జగన్ ప్రభుత్వం పని చేస్తుంద‌ని మండిప‌డ్డారు.. వైసీపీ సర్పంచ్ లు కూడా బయటకు వచ్చి గళం విప్పుతున్నార‌ని, . సర్పంచ్ ల ఆందోళనకి జగన్ ఏం సమాధానం చెబుతారు అని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement