గుంటూరు శివారు నాయుడుపేట జిందాల్ కంపెనీ సమీపంలో దారుణం జరిగింది. చెత్త కాగితాలు ఏరుకోవడానికి పిల్లలతో కలిసి చిలకలూరిపేట నుంచి లారీలో ఓ మహిళ వచ్చింది. చిలకలూరిపేట నుంచి గుంటూరుకు లారీలో వచ్చిన మహిళ అదే లారీ కింద పడి చనిపోయింది. అయితే లారీ దిగినప్పుడు డ్రైవర్తో జరిగిన వాగ్వాదంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. గుంటూరు శివారు నాయుడుపేట వద్ద లారీ దిగి డ్రైవర్కు 100 రూపాయలు ఆ మహిళ ఇచ్చిందని, కానీ, డ్రైవర్ 300 రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
దీంతో తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో లారీని ఆపకుండా ముందుకు కదిలించాడు. ఈ క్రమంలో తన పిల్లలు లారీలో ఉండడంతో వారికోసం లారీని పట్టుకుని వేలాడుతూ కొంతదూరం వెళ్లిన ఆ మహిళ అదుపుతప్పి అదే లారీ చక్రాల కింద పడిపోయింది. ఆ మహిళను రమణ (40)గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. తల్లి మృతదేహం వద్ద కన్నీరుమున్నీరవుతున్న పిల్లలను చూసి అటుగా వెళ్లేవారు కంటతడి పెడుతున్నారు.