Sunday, April 28, 2024

AP – ఇదే ఫైన‌ల్‌! జ‌గ‌న్ మూడ్ మారింది

మార్పు ఉండ‌దంటూనే చేసిప‌డేశారు
అభ్య‌ర్ధుల‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ షాక్
నెల్లూరు లోక్‌స‌భ బ‌రిలో విజ‌య‌సాయి
మంగ‌ళ‌గిరిలో గంజి చిరంజీవికి షాక్
టీడీపీ కీల‌క నేత నారా లోకేష్‌పై లావ‌ణ్యాస్త్రం
చ‌ర్చ‌కు దారితీస్తున్న ప‌లు నిర్ణ‌యాలు

అభ్యర్థుల మార్పు ఇక ఉండదు.. ఇప్పటివరకు మార్పు చేసిందే ఫైనల్‌. తక్కిన వాటిల్లో పాత వాళ్లే అభ్యర్థులుగా ఉంటారని ఈ మధ్యనే ప్రకటించిన వైసీపీ అధినేత, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థుల మార్పుపై మాట తప్పారు. అభ్యర్థుల మార్పును కొనసాగిస్తూనే ఉన్నారు. మరో జాబితాను విడుదల చేశారు. శుక్రవారం రాత్రి తాజాగా 9వ అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇందులో ఒక లోక్​సభ స్థానంతో పాటు రెండు అసెంబ్లీ స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించారు. నెల్లూరు లోక్​సభ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వేణుంబాకం విజయసాయిరెడ్డిని ప్రకటించారు. కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గానికి మైనారిటీ వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి ఎఎండీ ఇంతియాజ్‌ను, మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గానికి లావణ్యను అభ్యర్థులుగా ప్రకటించారు.

నెల్లూరు నుంచి విజయసాయిరెడ్డి పోటీ..

వేణుంబాక విజయసాయిరెడ్డి ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన నెల్లూరు జిల్లా తాళ్లపూడిలో జన్మించారు. చార్టెడ్‌ అకౌంటెడ్‌గా పేరు సంపాదించారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో తన సంస్థలను విస్తరింపజేశారు. కొన్ని జాతీయ బ్యాంకులకు బోర్డు సభ్యునిగా పని చేశారు. ఓరియంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ డైరెక్టుర్​గా కూడా పనిచేశారు. దివంగత నేత వైఎస్సార్​, ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి వ్యాపార సంస్థలకు కూడా విజయసాయిరెడ్డి ఆడిటర్‌గా పని చేశారు. జగన్ మోహన్​రెడ్డి వైఎస్సార్​ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించిన తర్వాత ఆ పార్టీలోకి వచ్చారు. అనతికాలంలోనే పార్టీ కీలక నేతగా మారారు. ఢిల్లీలో వైసీపీ వ్యవహారాలు చూసే కీలక బాధ్యతను కూడా ఆయనకే జగన్‌ అప్పగించారు. జగన్‌ తర్వాత విజయసాయిరెడ్డి రెండో స్థాయి లీడర్‌గా తిరుగులేని నేతగా పార్టీలో గుర్తింపు పొందారు.

కర్నూలు నుంచి మాజీ ఐఏఎస్‌ ఇంతియాజ్‌

ఇంతియాజ్‌ మైనారిటీ వర్గానికి చెందిన ఐఏఎస్‌ మాజీ అధికారి. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన వారు. ఈ మ‌ధ్య‌నే ఆయన ఐఏఎస్ జాబ్‌కు రాజీనామా చేసి సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ పార్టీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు ఆయన సెర్ప్‌ సీఈవోగా, సీసీఎల్‌ఏ అదనపు కమిషనర్‌గా, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహించారు. అంతకుముందు ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. సీఎం నిర్వహించిన స‌ర్వే రిపోర్టులు త‌న‌కు అనుకూలంగా రావడంతో ఇంతియాజ్‌కు టికెట్‌ ఖరారు చేసిన‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

మంగళగిరిలో లావణ్య

మంగళగిరి నియోజకవర్గ వైసీపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుతో పాటు మురుగుడు సత్యం, లావణ్య దంపతులు గ‌త రాత్రి కలిశారు. ఇప్పటి వరకు గంజి చిరంజీవి మంగళగిరి పార్టీ ఇన్‌చార్జిగా ఉన్నారు. గత ఏడాది డిసెంబరు 11న సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరుసటి రోజు నుంచి గంజి చిరంజీవిని నమన్వయ కర్తగా నియమిస్తూ వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. రెండు నెలల పది రోజుల వ్యవధిలో చిరంజీవి మార్పుకు గురయ్యారు.

లేటెస్ట్ లిస్టులో లావ‌ణ్య‌కు చోటు..

మంగళగిరి చెందిన మురుగుడు లావణ్యను నియోజక వర్గ సమన్వయ కర్తగా శుక్రవారం విడుదల చేసిన జాబితాలో అవకాశం కల్పించారు. లావణ్య ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు చిన్న కోడలు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకు కుమార్తె. వీరిద్దరి రాజకీయ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి వారి కోరిక మేరకు మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించారు. లావణ్య బీఎస్సీ కంప్యూటర్స్, ఎంఏ తెలుగు లిటరేచర్‌ చదువుకున్నారు. ఈ నియామకంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఇక నారా లోకేష్‌తో లావ‌ణ్య ఢీకొనే అవ‌కాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement