కరోనా వాక్సిన్ పై అవగాహన.. చెన్నై ఆర్టిస్ట్ వినూత్న ప్రయోగం!

దేశ ప్రజలు ప్రస్తుతం కరోనా వేరియంట్ల భయంతో ఉన్నారు. ఒకదాని తర్వాత ఒకటి విరుచుకుపడుతుండడంతో ఆందోళనతో జీవిస్తున్నారు. అయితే వైరస్ ను తరిమేందుకు వ్యాక్సిన్ ఒక్కటే దివ్య ఔషధం. టీకా తీసుకుంటే కరోనా చూపే ప్రభావం తక్కువే. అందుకే ప్రధాని నుంచి కిందిస్థాయి అధికారుల దాకా టీకా మస్ట్ అని అంటున్నారు. అయితే నేను సైతం ఈ ఉద్యమంలో భాగమంటూ ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. అద్భుతమైన ఆవిష్కరణలతో ఆకట్టుకుంటున్నాడు ఆర్ట్ కింగ్ డమ్ వ్యవస్థాపకుడు గౌతమ్.

గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ సహకారంతో ఆటో రూపురేఖలు మార్చేశాడు. పైపులు, ప్లైవుడ్, కార్డ్ బోర్డ్స్ ఉపయోగించి ఆటోకి చుట్టూ టీకా సీసా, ఇంజెక్షన్లను ఏర్పాటు చేశాడు. వ్యాక్సిన్ పై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో తాను అధికారులను సంప్రదించగా వారు సానుకూలంగా స్పందించారని… అలా ఈ టీకా ఆటో రూపు దిద్దుకుందని తెలిపాడు గౌతమ్. రెండు నెలల క్రితమే ఇది కార్యరూపం దాల్చాల్సి ఉండగా.. తాను కరోనా బారిన పడడంతో ఆలస్యం అయిందని చెప్పాడు. మణికందన్ అనే వ్యక్తి ఈ ఆటోను నడుపుతున్నాడు. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న ప్రాంతాలకు పంపి అక్కడ అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. టీకాలకు సంబంధించిన పత్రాలను పంచుతున్నారు. సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు ప్రజలను పంపిస్తున్నారు. వర్షం పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించేలా ఈ టీకా ఆటోను రూపొందించాడు గౌతమ్. గతంలో పోలీసుల కోసం కరోనా హెల్మెట్లు తయారు చేశాడు.