ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం మాదే

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం బీజేపీదేనని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం త‌మ పార్టీనే అని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థులు ఓడిపోయిన నేప‌థ్యంలో ఆయ‌న ఈ రోజు హైద‌రాబాద్‌లో మీడియాతో  మాట్లాడుతూ.. పీఆర్సీపై ప్ర‌భుత్వం నాట‌కాలు ఆడుతోందని చెప్పారు. ఉద్యోగులకు మంచి చేస్తే తాము సంతోషిస్తామ‌ని చెప్పారు. టీఆర్ఎస్ నేత‌లు పట్టభద్రులను బెదిరింపులకు గురిచేశారని ఆయ‌న ఆరోపించారు. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఎలా గెలిచిందో ప్రజలకు తెలుసన్నారు.. త‌మ పార్టీ ఓటు శాతం పెరిగింద‌ని, దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆందోళన మొదలైందని తెలిపారు. త‌మ పార్టీ ఓటమే లక్ష్యంగా ఇత‌ర పార్టీలు పనిచేశాయని బండి సంజ‌య్ మండిపడ్డారు. బీజేపీని అడ్డుకోవడానికి సీఎం వందల కోట్లు కుమ్మరించారని ఆరోపించారు.  ఈ గెలుపుతో పీవీ గెలిచినట్లా? లేక కేసీఆర్ గెలిచినట్లో సీఎం సమాధానం చెప్పాలని బండి డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కచ్చితంగా బీజేపీ గెలుస్తుందని బండి ధీమా వ్యక్తం చేశారు.