Friday, May 17, 2024

Open Letter – జ‌గ‌న్ కు ష‌ర్మిల మ‌రో లేఖ‌.. మ‌ద్య నిషేధంపై సూటి ప్ర‌శ్న ..

అమ‌రావ‌తి – ‘నవ సందేహాలు’ పేరుతో ఏపీ సీఎం జగన్‌కు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరో లేఖ రాశారు. ఈసారి ఆమె మద్యనిషేధం ప్రస్తావన తీసుకువచ్చారు. వైఎస్సార్సీపీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మద్యనిషేధం హామీ అమలు ఎక్కడ అని ప్రశ్నించారు. వారు ప్రకటన చేసినట్లు మద్య నిషేధం హామీ పాక్షికంగానైనా అమలవుతోందా? అని నిలదీశారు. మూడు దశల్లో అమలు చేస్తామన్నారని.. నిషేధం తర్వాతే మళ్లీ ఓట్లు అడుగుతామన్నారని గుర్తు చేశారు.

- Advertisement -

“మద్యం అమ్మకాలతో ఆదాయాన్ని రూ.30 వేల కోట్లకు పెంచుకున్నారు. గతంలో మద్యంపై ఆదాయం.. ప్రజల రక్తమాంసాలపై వ్యాపారమన్నారు.. మరి మీరేం చేశారు? కనీవినీ ఎరగని బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.11 వేల కోట్లు రుణాలెందుకు? డ్రగ్స్‌ పట్టుబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఎందుకుంది? 20.19 లక్షల మంది డ్రగ్స్‌కు అలవాలటు పడటం మీ వైఫల్యం కాదా?’’ అని వైఎస్ షర్మిల లేఖలో ప్రశ్నించారు.

అమ్మ అమెరికా ఎందుకు వెళ్లిందంటే.
కొడుకు అధికార పార్టీ, కూతురేమో ప్రతిపక్షం.. ఇద్దరిలో ఎవరికి మద్దతు తెలపాలనే ప్రశ్న ఎదురైతే జవాబివ్వడం అంత తేలిక కాదని షర్మిల పేర్కొన్నారు. . రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండగా తన తల్లి వైఎస్ విజయమ్మ అమెరికా ఎందుకు వెళ్లారనే ప్రశ్నకు జవాబిచ్చారు. తనకు, తన సోదరుడు జగన్ కు మధ్య రాజకీయంగా పోటీ అనివార్యం కావడంతో ఎవరివైపు నిలబడాలనే ప్రశ్న తన తల్లికి ఎదురైందని చెప్పారు. అయితే, ఎవరో ఒకరి వైపు ఉండడం కన్నా ఇద్దరికీ సమదూరం పాటించడం, ఏ ఒక్కరి స్టాండ్ తీసుకోకపోవడమే మేలని విజయమ్మ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన తల్లి విజయమ్మ దేశంలో ఉండకుండా అమెరికా వెళ్లిపోయిందని వివరించారు.

ప్రత్యేక హోదా విషయం మరిచారు..
ఆంధ్రప్రదేశ్ కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తో కానీ ఎలాంటి ఉపయోగం లేదని షర్మిల విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వాళ్లిద్దరూ ఘోరంగా ఫెయిలయ్యారని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు మాటమార్చారని, ప్రత్యేక హోదా హామీతో అధికారం దక్కించుకున్న జగన్ కూడా ఎన్నికలయ్యాక ప్రత్యేక హోదా విషయం మరిచిపోయారని విమర్శించారు. వీరి వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగంలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అత్యవసరమని, ప్రజల కష్టాలను తొలగించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా చేయాలని రాహుల్ గాంధీ తపనపడుతున్నాడని షర్మిల చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఏపీలో పర్యటించినపుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రాధాన్యతా అంశంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని షర్మిల గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement