భారత రెజ్లర్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ న అరెస్ట్ చేయాలని కోరుతూ రెజ్లర్లను తమ ఆందోళనను కొన్ని నెలలుగా కొనసాగిస్తున్నారు.. అయినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తామ ఇప్పటి వరకూ సాధించిన పతకాలను నేటి సాయంత్రం హరిద్వార్ లోని గంగానదిలో నిమజ్ఞనం చేస్తామని వెల్లడించారు.. ఇది ఇలా ఉంటే కొత్త పార్లమెంటు భవనం వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధం కాగా వారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు. దీక్ష కోసం ఇకపై జంతర్ మంతర్ వద్దకు అనుమతించబోమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం నాటి పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ . తాము సాధించిన పతకాల కు ఎటువంటి అర్థం లేకుండా పోయిందని. వాటిని నేటి సాయంత్రం హరిద్వార్లోని గంగా నదిలో కలిపేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు.
‘మే 28న జరిగిన పరిణామాలను అందరూ చూశారు. శాంతిపూర్వకంగా నిరసన చేపడుతున్న మాపై పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పైగా మాపైనే కేసు బనాయించారు. మహిళా క్రీడాకారులు తమకు న్యాయం చేయాలని కోరడం తప్పా? దేశం తరఫున తాము పతకాలు ఎందుకు సాధించామా? అని అనిపిస్తోంది. ఇప్పుడు వాటికి ఎటువంటి అర్థం లేకుండా పోయింది. వాటిని తిరిగి ఇవ్వడం మరణంతో సమానం. కానీ, ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకడం కష్టం. రాష్ట్రపతి, ప్రధానికి పతకాలను తిరిగి ఇచ్చేద్దామన్నా.. మనసు ఒప్పుకోవడం లేదు. వారిద్దరూ మా సమస్యలను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సాయంత్రం హరిద్వార్ వద్ద పవిత్ర గంగా నదిలో వాటిని కలిపేయనున్నాం. ఈ పతకాలే మా ప్రాణం.. ఆత్మ. అందుకే.. వాటిని గంగలో కలిపేశాక ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాం’ అని రెజ్లర్ బజరంగ్ పునియా ఓ ట్వీట్ చేశారు.